ఏకగ్రీవాలు వక్రమార్గం..! పంచాయతీ మాదిరిగానే ఎంపీటిసి..! అసహనం వ్యక్తం చేస్తున్న జనాలు..!!
Recommended Video
హైదరాబాద్ : మంచి లక్ష్యంతో ప్రోత్సహిస్తున్న ఏకగ్రీవాలు వక్రమార్గం పడుతున్నాయి. జనవరిలో పలు పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా చాలా మంది ఎంపికయ్యారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగా ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలకు ఎక్కువగా ఆస్కారం ఉంది. జడ్పీటీసీ పరిధి మండలమంతా విస్తరించి ఉంటుంది కాబట్టి వాటిలో ఎంపీటీసీల అంతటి స్థాయిలో ఏకగ్రీవాలు ఉండవు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల్లో కంటే కొంత భిన్నంగా తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.
వేలం పాటల గుట్టు విప్పేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక విభాగాలు..! అప్రమత్తమైన ఈసి..!!
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆమోదముద్ర తర్వాతే ప్రకటిస్తారు. వేలం నిర్వహించి ఎక్కువ ధరకు పాడుకున్నవారితో మాత్రమే నామినేషన్ వేయించిన సందర్భాలు ఉన్నట్లైతే వాటి గుట్టువిప్పి చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటవుతుంది. మొదటి దశ నామినేషన్ల ఘట్టం ముగిసిపోయిన రోజున (ఆదివారం) రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఇలాంటి మార్గదర్శకాలు సజావుగా అమలుకావటమే ఇప్పుడు కీలకమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నామినేషన్లు ఉపసంహరించుకోగానే ప్రకటించొద్దు..! అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్న ఈసీ..!!
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగానే రిటర్నింగ్ అధికారులు(ఆర్వోలు) ఏకగ్రీవ విజేతల ను ప్రకటించకూడదు. ఒకే నామినేషన్ గల ప్రాదేశిక నియోజకవర్గం గురించి అక్కడి ఆర్వో కలెక్టర్కు తెలియజేయాలి. ఇలాంటి కేసులను విచారించి తగిన చర్యలు చేపట్టేందుకు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుకావాలి నియమాలు విధించారు.
పరిషత్ ఎన్నికలకు మార్గదర్శకాలు..! అమలే కీలకం..!!
నామినేషన్లు వేయకుండా లేదా వేసిన వాటిని ఉపసంహరించుకోవాలని ఎవరైనా ఒత్తిడి చేసుంటే బాధితులు ఈ విభాగంలో ఫిర్యాదు చేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. మీడియాలో వచ్చే కథనాలనూ ఈ విభాగం పరిగణనలోకి తీసుకోవాలి. వేలం పాటలు నిర్వహించిన వారిపైనా, బరిలోకి దిగకుండా బెదిరించిన వారిపైనా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆతేశాలు జారీ చేసింది.
కలెక్టర్లు నిర్ధారించిన తర్వాతే విజేత ప్రకటన..! వీఆర్వోలు తొందరపడకూడదన్న ఈసీ..!!
తమకు వచ్చిన ఫిర్యాదులపై ప్రాథమిక పరిశీలన తర్వాత అక్కడ వాస్తవం ఉందని తేలితే సాధారణ పరిశీలకులకు, ఎన్నికల సంఘానికి ఆయా కలెక్టర్లు నివేదికలను పంపాలి. కలెక్టర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ఆర్వోలు ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లోని ఏకగ్రీవ విజేతల పేర్లను ప్రకటించాలి. అయితే, ఈ నిబంధనలు కచ్చితంగా అమలుచేయడమే ఇప్పుడు కీలకంగా మారింది.