కూలీలు నిద్రిస్తుండగా: నానక్రాంగూడలో కూలిన ఏడంతస్తుల బిల్డింగ్, ఇవే కారణమా?
భాగ్యనగరంలోని నానక్రాంగూడలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. గురువారం రాత్రి పది గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: భాగ్యనగరంలోని నానక్రాంగూడలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. గురువారం రాత్రి పది గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద 6 కార్మిక కుటుంబాలు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని సమాచారం. ప్రమాదం సమయంలో కూలీలు అంతా నిద్రపోతున్నారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఘటనస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
కాగా, ఈ భవనం సత్యనారాయణ అనే వ్యక్తికి చెందినదని గుర్తించారు. నిర్మాణం లోపభూయిష్టంగా ఉండటంతో కూలిపోయిందని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలికి అంబులెన్సులు చేరుకున్నాయి. శిథిలాల కింద పది నుంచి ఇరవై మంది ఉంటారని భావిస్తున్నారు.
హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బరాబాద్ సీపీ సందీప్ శాండిల్య కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మాదాపూర్ పోలీసులు రెండు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
విశాఖ జిల్లా కూలీలు
నిర్మాణ పనుల కోసం ఆరు కుటుంబాలు కూలీ పని కోసం వచ్చాయి. ఈ భవంతిలోనే నివాసం ఉంటున్నారని తెలుస్తోంది. వీరిలో 16 మంది పురుషులు, మహిళలు, పిల్లలు కలిసి మొత్తం 20 మంది ఉంటారని, వీరంతా శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఎవరినీ బయటకు తీయలేకపోయారు. బాధితులంతా విశాఖ జిల్లాకు చెందిన వారుగా సమాచారం.
సత్తు సింగ్
టోలీచౌకికి చెందిన సత్తు సింగ్ అనే వ్యక్తి నానక్ రాం గూడలో 220 గజాల స్థలాన్ని కొని ఎలాంటి అనుమతులు లేకుండా జి ప్లస్ ఆరు అంతస్తుల నిర్మాణాన్ని గత ఏడాది ప్రారంభించాడు. కనీస ప్రమాణాలు లేవని చెబుతున్నారు. దాదాపు భవనం పూర్తయింది. అద్దెకు ఇవ్వడానికి వీలుగా కొన్ని సింగిల్, కొన్ని డబుల్ బెడ్ రూం అపార్టుమెంట్లు నిర్మించారని అంటున్నారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి
నానక్రాంగూడలో భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి ప్రమాదం గురించి ఆరా తీశారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను చేపట్టాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కారణాలెన్నో!
కుప్పకూలిన అపార్టుమెంటుకు ఆనుకొని మరో నిర్మాణ సంస్థ ఓ భారీ వెంచర్ను నిర్మించేందుకు సిద్ధమైందని, దాని పునాది, సెల్లార్ల కోసం ఇటీవల భూమి పూజ చేసి పనులు ప్రారంభించిందని, 50 అడుగుల తటాకం తవ్విందని, అపార్టుమెంటును ఆనుకునే ఈ భారీ వెంచర్ తవ్వకాలు చేపట్టిందని, అపార్టుమెంట్ విధానం పరిశీలించిన అధికారులు.. ఏడంతస్తుల భవనం కూలడానికి ఈ తవ్వకాలు కూడా ఓ కారణం అయి ఉండవచ్చునని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
శిథిలాలను
భవన శిథిలాలను తొలగించేందుకు ఆరు నుంచి పది గంటలు పడుతుందని, పూర్తిగా శిథిలాలు తొలగిస్తే కానీ దాని కింద ఎందరున్నారో తెలియరాదని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి రాత్రి చెప్పారు. సత్యనారాయణ సింగ్కు చెందిన భవనం కూలిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని జిహెచ్ఎంసి అధికారులు చెప్పారు.
తొమ్మిది పది గంటల మధ్య
భవనం రాత్రి తొమ్మిది పది గంటల మధ్య కూలిపోతే అర్ధరాత్రి దాటే వరకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నాయి. శిథిలాల కింద సురక్షితంగా ఉన్న వారిని సజీవంగా బయటకు తీసుకు వచ్చే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శాస్త్రీయంగా వాటిని తొలగిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.