టిడిపిలో కమిటీ చిచ్చు: చంద్రబాబుపై ఎర్రబెల్లి సహా అలక, అసంతృప్తి!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కమిటీలతో ఆ పార్టీ తెలంగాణ నేతల్లో చిచ్చు చెలరేగిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆదివారం నాడు జరిగిన కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఎర్రబెల్లి దయాకర రావు, పెద్దిరెడ్డి, కృష్ణ యాదవ్ గైర్హాజరయినట్లుగా తెలుస్తోంది.
పార్టీ ప్రకటించిన కమిటీల్లో తమకు తగిన ప్రాధాన్యం లేదంటూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వాదనలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. దానికి తోడు, ప్రమాణ స్వీకారానికి పలువురు హాజరుకాకపోవడం అసంతృప్తిని నిర్ధారిస్తోందని అంటున్నారు.
పదవుల విషయంలో వారు అసంతృప్తి కారణంగానే గైర్హాజరై ఉంటారని అంటున్నారు. కష్టపడిన వారికి సరైన ప్రాధాన్యమవ్వడం లేదంటూ వారు వాపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురే కాకుండా, పార్టీకి చెందిన మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వర రావు కూడా గైర్హాజరయ్యారు.
తాను పార్టీలో క్రియాశీలకంగా లేనని, అందుకే రాలేదని ఆయన చెప్పారని తెలుస్తోంది. సీనియర్లను పక్కన బెట్టి జూనియర్లకు అవకాశం ఇచ్చారని, వారికే ప్రాధాన్యం ఇచ్చారని ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాశ్ రెడ్డిని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల ఎర్రబెల్లి అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తన్నాయి. తెలంగాణ టిడిపి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే.