తెరాసలో సమైక్యవాదులు: నాగం, ఎర్రబెల్లి ఫైర్
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సమైక్యవాదులు లేరా అని బిజెపి నేత నాగం జనార్దన్రెడ్డి ప్రశ్నించారు. మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన సోమవారంనాడు పాల్గొన్నారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకున్న ఘనత తెరాసకే దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రులు ఉత్పవ విగ్రహాలుగా మారారని నాగం విమర్శించారు.
మెదక్ ఉప ఎన్నికల నుంచి తెరాస పతనం ప్రారంభమవుతుందని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నేతలను కొనే అలవాటు హరీష్రావుదే అని సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.
గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే హరీష్రావు సవాల్కు సిద్ధంగా ఉన్నట్లు ఎర్రబెల్లి ప్రకటించారు. ఈనెల 10న సిద్ధిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వంద రోజుల పాలనలో మోసం తప్ప చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీకి షరతులు విధిస్తున్నారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ లోకసభ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ అధికార టిఆర్ఎస్పై బిజెపి, తెలుగుదేశం పార్టీల కూటమి నాయకులతో పాటు కాంగ్రెసు నాయకులు దాడిని పెంచారు. మెదక్లో తెరాస నిమజ్జనం అవుతుందని కాంగ్రెసు అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.