హైదరాబాద్ లో పర్యటించనున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్: రీజన్ ఇదే !!
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ లో పర్యటించనున్నారు . నిర్మలా సీతారామన్ ఈ నెల 16,17 తేదీల్లో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పర్యటించనన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది . మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020పై వివిధ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించనున్న నేపధ్యంలోనే ఈ పర్యటన చేస్తున్నట్టు తెలుస్తుంది .
తెలంగాణలో నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా శుక్రవారం (ఫిబ్రవరి 14) నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అధికారులంతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. ఇక నిర్మలా సీతారామన్ తన పర్యటనలో ముఖ్యంగా బడ్జెట్తో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు.
ఇక ఈ సమావేవం ప్రారంభం అయ్యాక మొదటి సెషన్లో ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. అదే విధంగా రెండో సెషన్లో ఆర్థికవేత్తలు, ఆడిటర్స్ తదితరులతో నిర్మల సమావేశం కానున్నారు.
బీజేపీ ప్రభుత్వం 2020 బడ్జెట్ ను సామాన్యుల బడ్జెట్ గా పేర్కొని ఈ బడ్జెట్లో వ్యవసాయం, నీటి పారుదల, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అనంతరం ఏ రాష్ట్రానికి ఎంత మేరకు బడ్జట్ ను కేటాయించిన విషయాల గురించి ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు.
అయితే బడ్జెట్ సంతృప్తికరంగా లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇక పోతే గతవారం ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లో నిర్వహించిన భేటీలలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇక 16,17 తేదీల్లో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.