పటేల్ సాధించారు: కెసిఆర్పై కేంద్రమంత్రి సాధ్వి నిప్పులు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి బుధవారం నిప్పులు చెరిగారు.
హైదరాబాద్/మేడ్చల్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి బుధవారం నిప్పులు చెరిగారు.
చదవండి: సంచలనం: 'టిఆర్ఎస్లో అసంతృప్తి, కాంగ్రెస్లోకి హరీష్ రావు'
ప్రజల స్వాతంత్రం హరిస్తున్న కెసిఆర్
కేసీఆర్ ప్రజల స్వాతంత్రాన్ని హరిస్తున్నారని నిరంజన్ జ్యోతి మండిపడ్డారు. తెలంగాణ బిజెపి శాఖ నిర్వహిస్తోన్న విమోచన యాత్రలో భాగంగా ఈ రోజు మేడ్చల్లో బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఆమె పాల్గొని, మాట్లాడారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు
1947లో భారత్కి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందని నిరంజన్ జ్యోతి చెప్పారు. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారన్నారు.
పటేల్ సాధించి పెట్టారు
సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తించి తెలంగాణకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారని సాధ్వి తెలిపారు. త్యాగాలకు నిలయమైన తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం బాధాకరమన్నారు.
స్వార్థం కోసం చరిత్ర వక్రీకరణ
త్యాగాలతో సాధించిన తెలంగాణ చరిత్రను కేసీఆర్ తన స్వార్థం కోసం వక్రీకరిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బిజెపి తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. విమోచన దినంపై కేసీఆర్ ఉద్యమంలో ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారన్నారు.