టిఆర్ఎస్ వల్లే ఐసిస్: కేంద్రమంత్రి తీవ్రవ్యాఖ్యలు, పార్టీ మారుతానని రాజాసింగ్ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత హన్సరాజ్ గంగారామ్ అహిర్ బుధవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెరాస ప్రభుత్వం వల్లనే హైదరాబాదులో ఐసిస్ ఉగ్రవాదం ఉందని మండిపడ్డారు.
ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లనే యువత ఉగ్రవాదం వైపు చూస్తున్నారని విమర్శించారు. దేశమంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పూజిస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం మాత్రం నిజాంను పొగుడుతోందని ఎద్దేవా చేశారు.
నల్లకుంటలో బిజెపి కార్యాలయం ప్రారంభం
నల్లకుంటలో ఏర్పాటు చేసిన బిజెపి ఎన్నికల కార్యాలయాన్ని కేంద్ర సహాయమంత్రి హన్స్రాజ్ గంగారామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్త, చెదారం దర్శనమిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన రెండు పడక గదుల ఇళ్లు ప్లెక్సీల పైనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అధిష్టానానికి రాజాసింగ్ హెచ్చరిక
హైదరాబాదు బీజేపీలో ముసలం పుట్టేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పాటుపడుతున్న వారిని కాదని, కొత్తవారికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం సీట్లు ఇస్తే ఊరుకునేది లేదన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరుగురు అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించానని, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తనను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి బయటకు పంపాలనే లక్ష్యంతో వారికి సీట్లు నిరాకరిస్తున్నాడని ఆరోపించారు.
పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవ చేస్తున్న వారిపై రౌడీ షీట్లు ఉన్నాయని, అలాంటి వారిని రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. పార్టీ వారికి సీట్లిచ్చేందుకు నిరాకరిస్తే వారు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా వారికే తాను ప్రచారం చేస్తానని, పార్టీ అభ్యర్థుల గురించి తనకు సంబంధం లేదన్నారు. లేదంటే తాను వేరే పార్టీలో చేరాల్సి ఉంటుందని హెచ్చరించారు.