ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్రం కసరత్తు.. ఎందాకా వచ్చిందంటే..
అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లో త్వరలోనే ఎన్నికలు జరపాలనుకుంటోన్న మోదీ సర్కారు.. పనిలోపనిగా అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలని భావిస్తోంది. గురువారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు జమ్మూకశ్మీర్ బ్లాక్ లెవల్ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వ్యవహారం.. అసెంబ్లీ స్థానాల పెంపు కోసం ఎదురు చూస్తోన్న ఏపీ, తెలంగాణ వర్గాలకు ఉత్తేజం తెప్పించింది. సీట్ల పెంపుపై విభజన చట్టంలోనూ పేర్కొన్న నేపథ్యంలో దీనిపై హైప్ ఏర్పడింది.
Recommended Video
అయితే తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీళ్లు చల్లారు. నిజానికి జమ్మూకాశ్మీర్ లోనూ అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ మొదలు కాలేదని, కేవలం పరిశీలన స్థాయిలోనే ఉందన్న ఆయన.. ఏపీ, తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ సీట్లు పెంచబోమన్నారు. అయితే పెంపుపై విధానపరంగా ముందుకు వెళతామని, ఆ మేరకు కసరత్తు జరుగుతున్నదని, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఫైలు ప్రస్తుతం న్యాయ శాఖ దగ్గర పెండింగ్ లో ఉందని మంత్రి తెలిపారు.
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారాన్ని కేంద్ర న్యాయ శాఖ పరిశీలుస్తున్నదన్న కిషన్ రెడ్డి.. అంతలోనే విభజన చట్టంలో లోపాలను ప్రస్తావించారు. నాటి ప్రభుత్వం విభజన చట్టాన్ని అడ్డగోలుగా రూపొందించిందని, అప్పటిదాకా లేని సీట్ల పుంపు పాయింటును రాత్రికి రాత్రి చేర్చారని మంత్రి విమర్శించారు. అన్ని రాష్ట్రాలతోపాటే ఏపీ, తెలంగాణలో సీట్లు పెరుగుతాయన్నారు.