బీజేపీ 'సాగర్' మేనిఫెస్టో విడుదల... కేంద్రీయ విద్యాలయం,ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు హామీ...
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీలు చేసిందేమీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సుదీర్ఘ కాలం సాగర్ నుంచి ప్రాతినిధ్యం వహించి,మంత్రిగా పనిచేసిన జానారెడ్డి సాగర్ అభివృద్దిని పట్టించుకోలేదన్నారు. అలాగే టీఆర్ఎస్ పాలనలో సాగర్లో ఏమాత్రం అభివృద్ది జరగలేదన్నారు. కాంగ్రెస్,టీఆర్ఎస్ రెండు పార్టీలు సాగర్ నియోజకవర్గ అభివృద్దిని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. సాగర్ ఉపఎన్నికలో బీజేపీకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది బాట పట్టిస్తామన్నారు. శనివారం(ఏప్రిల్ 10) హాలియా పట్టణంలో జరిగిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.
సాగర్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే...
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే వెంటనే కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సాగర్ టు నల్గొండ,సాగర్-హైదరాబాద్ మార్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా మారుస్తామన్నారు. తెలంగాణకు మంజూరైన రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్దికి ప్లానింగ్ కమిషన్ నుంచి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. బౌద్ద మత ఆధ్యాత్మిక కేంద్రంగా సాగర్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేలా పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్,ముద్ర యోజన పథకం ద్వారా రుణాలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామన్నారు. సాగర్ నియోజకవర్గంలోని ప్రతీ తండాలో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
జానారెడ్డి చేసింది సున్నా...
దుబ్బాక,జీహెచ్ఎంసీలలు ప్రజలు బీజేపీని గెలిపించారని... 2023లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ తీర్పుతో సంకేతాలిచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. సాగర్ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని... బీజేపీకి ఓటు వేయడం ద్వారా అభివృద్దిని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. ఇక్కడ కనీసం ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేకపోవడం దారుణమన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించుకోలేదని,ఉపాధి కల్పన చేపట్టలేదని ఆరోపించారు. ప్రజల బతుకుల్లో మార్పుకు జానారెడ్డి చేసింది సున్నా అని ఆరోపించారు.
బీజేపీకి అవకాశం ఇవ్వండి : కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ వచ్చాక కూడా సాగర్లో అభివృద్ది జరగలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. హాలియాలో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం... ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదన్నారు. గ్రామీణ రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారే తప్ప... వాటి అభివృద్దికి నిధులు మంజూరు చేయడం లేదన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నా... ఇక్కడి రైతులు,ప్రజలను ఇంకా సాగునీటి,తాగునీటి ఇబ్బందులు వెంటాడుతున్నాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత దాన్ని మర్చిపోయారని అన్నారు. కాంగ్రెస్,టీఆర్ఎస్ రెండు పార్టీలు సాగర్కు న్యాయం చేయలేకపోయాయని... కాబట్టి సాగర్ ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.