అంబేద్కర్ వర్ధంతి నాడు దళిత బంధుపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దళిత బంధు పథకం అమలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు కేంద్రమంత్రి బిజెపి నాయకులు కిషన్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున దళితులపై కెసిఆర్ కు ప్రేమ లేదని తేల్చి చెప్పారు. హుజరాబాద్ ఉప ఎన్నికల కోసమే కేసీఆర్ దళిత బంధు పేరుతో దళితులను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళులర్పించిన కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
ఉపఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెప్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దళితులకు మేలు చేసే ఉద్దేశం సీఎం కేసీఆర్ కు ఉంటే తక్షణమే దళిత బంధు అమలు చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ పై నిందలు వేసి వరద బాధితులకు నష్ట పరిహారాన్ని టిఆర్ఎస్ సర్కార్ ఎగ్గొట్టింది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు మరోసారి బిజెపి మీద నిందలు వేసి దళిత బంధును పక్కన పెట్టారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. కెసిఆర్ వి మాయ మాటలని మండిపడిన కిషన్ రెడ్డి దళిత బంధు విషయంలో సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. దళితులపై కేసీఆర్ కు ప్రేమ ఉంటే దళిత బంధు తక్షణం అమలు చెయ్యాలన్నారు.
Recommended Video
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీద నిప్పులు చెరుగుతున్నారు. కిషన్ రెడ్డి దద్దమ్మ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సందర్భం ఏదైనా బిజెపిని టార్గెట్ చేసే ప్రతీసారి, కిషన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి కూడా కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ వాగ్బాణాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో అనేక అంశాలపై కెసిఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్న సమయంలో దళిత బంధుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గులాబీ నేతలు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.