ఇంకోసారి నిధుల కోసం కేంద్రం వద్దకు రావద్దు.. మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి హెచ్చరిక..
మెట్రో రైలు నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యతను మెట్రో అధికారులు విస్మరించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ.1200 కోట్లు ఇస్తే.. కనీసం హోర్డింగుల్లో ఎక్కడా ప్రధాని ఫోటో పెట్టలేదని మండిపడ్డారు. ఆఖరికి స్థానిక ఎంపీని అయిన తనను మెట్రో ప్రారంభోత్సవానికి పిలవరా అని ప్రశ్నించారు. మెట్రో ప్రారంభోత్సవాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫంక్షన్ లాగా జరుపుకున్నారని విమర్శించారు. కేంద్రం మరో రూ.250కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఇంకోసారి నిధుల కోసం తమ వద్దకు రావద్దని హెచ్చరించారు.
మజ్లిస్-టీఆర్ఎస్ కుట్ర..
నిజానికి హైదరాబాద్ పాతబస్తీ వరకు మెట్రో నిర్మాణం జరగాల్సి ఉందని.. కానీ పాతబస్తీ అభివృద్ది చెందడం మజ్లిస్కు ఇష్టం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ కుట్రలో టీఆర్ఎస్ భాగమై పాతబస్తీకి మెట్రోను దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ ప్రజలు మజ్లిస్ కుట్రలు,టీఆర్ఎస్ వైఖరిని అర్థం చేసుకోవాలన్నారు. మెట్రో వస్తే పాతబస్తీ రూపు రేఖలు మారిపోయేవని.. కానీ కుట్రపూరితంగా మెట్రోను అక్కడిదాకా తీసుకెళ్లలేదని ఆరోపించారు. కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్లో పాతబస్తీ వరకు మెట్రో నిర్మాణం చేపడుతామని చెప్పారని.. అందుకే కేంద్రం కూడా రూ.1458కోట్లు సాయం అందించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు.
ఎంఎంటీఎస్ రెండో దశ..
మెట్రోతో సమాంతరంగా రెండో దశ ఎంఎంటీఎస్ను కూడా చేపట్టాల్సి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. అయితే కేంద్రం తన వాటా ఇచ్చినప్పటికీ.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను ఇవ్వకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా ఇవ్వకపోతే.. కేంద్రమే అదనపు నిధులను చెల్లించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా తమ వాటా చెల్లిస్తే.. అంత త్వరగా రెండో దశ ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
మెట్రో కోసం కృషి చేసినవారికి కృతజ్ఞతలు..
మెట్రో నిర్మాణాన్ని ఎల్&టీ అద్భుతంగా చేపట్టిందని.. ఇందుకోసం కృషి చేసిన ప్రతీ కార్మికుడికి,ఉద్యోగికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. హైదరాబాద్ అభివృద్దికి కేంద్రం అన్ని రకాల సహాయ సహకరాలు అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మిస్తే.. అన్ని ఇళ్లకు తమ వాటా కింద నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. పేద ప్రజలకు ప్రధానంగా కావాల్సినవి ఇల్లు,తిండి,ఆరోగ్యం అని చెప్పారు. ఈ మూడు కేంద్రం పేదలకు అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోన్న రూ.1 కిలో బియ్యానికి కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5లక్షల వరకు ప్రైవేట్,కార్పోరేట్ వైద్య సేవల సౌకర్యాన్ని కల్పించిందన్నారు.
మెట్రో అధికారులతో సమీక్ష..
అంతకుముందు హైదరాబాద్లోని దిల్ కుషా అతిథి గృహంలో శనివారం ఎల్&టీ మెట్రో అధికారులతో మంత్రి కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్&టీ ఎండీ కేవీబీ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీ నాయుడు, ఏకే షైనీ, హెచ్ఎంఎల్ఆర్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్ మోహన్, జీఎం రాజేశ్వర్ తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.ఎల్ అండ్ టీ సంస్థకు ఇక భవనాలు, అనుమతులు ఏవీ ఇవ్వమని కిషన్ రెడ్డి హెచ్చరించారు.