మోడీ ప్రభుత్వ విజయాలు ఇవీ!: దర్శకులు రాజమౌళిని కలిసిన కేంద్రమంత్రి
హైదరాబాద్: సంపర్క్ ఫర్ సమర్థన్లో భాగంగా బీజేపీ నేత, కేంద్రమంత్రి హన్స్రాజ్ అహిర్ గురువారం టాలీవుడ్ దర్శకులు రాజమౌళిని కలిశారు. రాజమౌళితో పాటు ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్లను కలిశారు.
హైదరాబాదులోని రాజమౌళి ఇంటికి పలువురు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి తదితరులతో కలిసి వచ్చిన ఆయన గడిచిన నాలుగేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించి, ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్లకు శాలువా కప్పి సత్కరించారు.
నాలుగేళ్లుగా నరేంద్ర మోడీ చేపట్టిన ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్కు వివరించామని కిషన్ రెడ్డి చెప్పారు.
గత కొంతకాలంగా బీజేపీ సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో ప్రముఖులను కలుస్తూ మోడీ ప్రభుత్వానికి మద్దతు కోరుతోన్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మొదలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.