హైదరాబాద్: తీగ తెగి పడిన లిఫ్ట్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలకు తృటిలో ముప్పు తప్పింది. వారు ఎక్కిన లిఫ్ట్ వైరు తెగిపోవడంతో లిఫ్ట్ మొదటి అంతస్థు నుంచి కిందికి పడిపోయింది.
అందులో కేంద్రమంత్రి జెపి నడ్డా, ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారంనాడు లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంక్యనాయుడు, దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.
శుక్రవారం సాయంత్రం లక్ష్మణ్ను అభినందించేందుకు కేంద్రమంత్రులు నిర్మాలా సీతారామన్, నడ్డా తదతరులు వచ్చారు. వీరంతా కలిసి లిఫ్ట్ ఎక్కగానే వైర్ తెగి కిందకు పడిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
సామర్థ్యానికి మించి వారు ఎక్కడం వల్లనే లిఫ్ట్ వైర్ తెగిపోయిందని అంటున్నారు. ఏమైనా, బిజెపి నేతలు సురక్షితంగా బయటపడ్డారు.