మేడారం జాతీయ పండగ!: సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కేంద్రమంత్రి అర్జున్
ములుగు: మేడారంలో గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను శనివారం ఉదయం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. అర్జున్ ముండాకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికారు.
మోడీ దృష్టికి జాతీయ పండుగ..
దర్శనం అనంతరం కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్నారని.. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. త్వరలో గిరిజనుల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల వద్ద ఆస్తులు లేకపోయినా.. ఆనందం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగ అంశంపై విన్నవించినట్లు తెలిపారు.
Recommended Video
మరోసారి వస్తా..
మరోసారి జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని అర్జున్ ముండా తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతలుగా సమ్మక్క-సారలమ్మ దేవతలు ప్రసిద్ధికెక్కారని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు.
మంత్రుల వినతి..
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రమంత్రి అర్జున్ ముండాను కోరినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 12 లక్షల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలను చేర్చినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
కోటిమందికిపైగా భక్తులు..
ఫిబ్రవరి 5-8 వరకు జరుగుతున్న మేడారం జాతరకు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు విచ్చేస్తున్నారు. ఇప్పటికే కోటి మందికిపైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయలు మేడారం అమ్మవార్లను దర్శించుకున్నారు. వారి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు.