కాంగ్రెస్ సద్బావన సమావేశం.!భిన్నత్వంలో ఏకత్వం దేశ మూల సిద్దాంతమన్న మానిక్కమ్ ఠాగూర్.!
హైదరాబాద్ : నగరంలోని చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 30వ సద్బావన యాత్ర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యనేతలతో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. మతాల మద్య వైషమ్యాలు, విద్వేషాలు తారాస్థాయిలో కొనసాగుతున్న తరుణంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చార్మినార్ వద్ద నిర్వహించిన సద్బావన ర్యాలీ వల్ల నగరంలో శాంతిభద్రతలకు బీజాలు పడ్డాయని, మతాల మద్య సామరస్య వాతావరణం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసారు.
రాజీవ్ భావి తరాల గురించి శ్రమించారు.. నేటి పార్టీలు ఎన్నికల గురించి పరితపిస్తున్నాయన్న మనిక్కమ్ ఠాగూర్..
ఈ సందర్బంగా తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలను నమ్ముకుంటుందని, సద్భావన గాంధీ సిద్ధాంతమని తెలిపారు. ఇతర మతాలనుగౌరవించడం మన సంప్రదాయమని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ మూల సిద్ధాంతమని మనిక్కమ్ ఠాగూర్ పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ లాంటి గొప్ప వ్యక్తులతో పని చేసిన నాయకులతో పని చేయడం తనకు గర్వంగా ఉందని అన్నారు. ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ భావి తరాలకోసం ఆలోచించారని, ఇప్పుడున్న ప్రధాన మంత్రులు రాబోయే ఎన్నికల గురించి, ఈవిఎం ల గురించి ఆలోచిస్తున్నారని మండిపడ్డారు మనిక్కమ్ ఠాగూర్.
మత సామరస్యమే కాంగ్రెస్ సిద్దాంతం.. ఐకమత్యంతో పని చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న ఉత్తమ్..
కాంగ్రెస్ మూల సిద్ధాంతం మత సామరస్యం, సామాజిక న్యాయమని తెలంగాణ పీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణతో కలిసి కట్టుగా పని చేయాలని, పార్టీ బలోపేతానికి అందరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికలో ప్రతి ఒక్క నాయకుడు కష్టపడి పని చేసి విజయ ఢంకా మోగించి చరిత్ర సృష్టించాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డు అదుపు లేదని మండిపడ్డారు. దుబ్బాకతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే.. మతాలమద్య విభేదాలు ప్రమాదకరమన్న భట్టి..
దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, శ్యామ్ పిట్రోడా మాత్రమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేసారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి గురించి 30 ఏళ్ల కిందనే ఆలోచించిన మహనీయులు రాజీవ్ గాందీ అని, 30 ఏళ్ల కింద నిర్వహించిన సద్భావన యాత్ర ఎంతో ముందు చూపుతో రూపకల్పన చేయబడిందని అభివర్ణించారు. దేశంలో మత వైశమ్యాలు చెలరేగినప్పుడు, విభేదాలు నెలకొన్నప్పుడు ఇలాంటి యాత్రలు ప్రజల మధ్య సౌభ్రాత్రుత్వం పెపొందడానికి ఉపయోగపడతాయని అన్నారు. కానీ దేశంలో మతాల మధ్య చిచ్చులు రాకుండా ఆపాల్సిన పాలకులు ఇప్పుడు మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడడం సిగ్గుచేటని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేసారు.
Recommended Video
సద్బావన యాత్ర వల్ల విద్వేషాలు తొలిగిపోయాయి..అది రాజీవ్ గాంధీ ముందుచూపుకు నిదర్శనమన్న విహెచ్..
ఇదిలా ఉండగా దేశంలో మత కల్లోలం చెలరేగినప్పుడు 1990 లో చార్మినార్ నుంచి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చారిత్రక సద్భావన యాత్ర నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. ఇందిరమ్మ ఉన్నంత కాలం దేశంలో మహిళలు ఎంతో దైర్యంగా ఉన్నారని, నేడు మోడీ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలోని రైతులకు అన్యాయం చేసేందుకు మోడీ మూడు బిల్లులు తీసుకొచ్చారని మండిపడ్డారు. అంతే కాకుండా రాజీవ్ గాంధీతో తనకు విడదీయలేని స్నేహం ఉండేదని, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతను రాజకీయలవైపు ప్రోత్సహించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని సద్భావన అవార్డు గ్రహీత శ్యామ్ పిట్రోడా తెలిపారు.