స్వైన్ ఫ్లూ: హైదరాబాద్ వర్సిటీ విద్యార్థిని మృతి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని స్వైన్ ఫ్లూ వ్యాధికి బలైంది. శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో 44మందికి నిర్ధారణ అయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని, ఫిజిక్స్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్) చేస్తున్న కె.సుధానిర్మల (33) మరణించారు. ఆమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. ఆమె శేరిలింగంపల్లిలో ఉంటున్నారు. కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉంటున్నట్లు సమాచారం.
వైరస్ లక్షణాలతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె, పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందినట్లు యూనివర్సిటీ హెల్త్సెంటర్ వైద్యురాలు డాక్టర్ అనుపమ తెలిపారు. మరోవైపు గాంధీలో 44 మందికి, ఫీవర్ ఆస్పత్రిలో 8 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. ఓపీ విభాగానికి వచ్చిన మరో 36 మందికి స్వైన్ లక్షణాలు ఉండడంతో మందులిచ్చి ఇంటికి పంపారు.
కాగా, 36 రోజుల నుంచి రాష్ట్రంలో 2212 మందికి పరీక్షలను నిర్వహించగా అందులో 738 మందికి వ్యాధి సోకినట్టు నిర్దారణ అయిందని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురే్షచందా పేర్కొన్నారు. అలాగే 41 మంది మృతి చెందినట్టు వివరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే తగిన చికిత్సను చేయించుకోవాలని సూచించింది.
సుధా నిర్మలకు పది రోజుల నుంచి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అయితే, ఆమె హైదరాబాదు విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించలేదు. ఆమె విశ్వవిద్యాలయం బయట ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిందని విశ్వవిద్యాలయ అధికారులు చెప్పారు.