కట్టలు తెంచుకున్న అభిమానమా..? కాకా పట్టడమా..? ఎంపి గారి విచిత్ర వ్యాఖ్యలు..!!
హైదరాబాద్ : ఒక్కోసారి రాజకీయ నేతల అభిమానం కట్టలు తెంచుకుంటుంది. భవిష్యత్ రాజకీయ అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని అధినాయుకుడికి తారా స్థాయిలో భజన చేస్తుంటారు. సంబందంలేని అంశానికి ముడిపెడుతూ మానాయకుడు అంత తోపు ఇంత తోపూ అని ప్రకటనలు ఇస్తూ అబాసుపాలౌతుంటారు. దీంతో సీరియస్ గా నడుస్తున్న రాజకీయాలను ఒక్క సారిగా కామెడీగా మారుస్తుంటారు.
తెలంగాణలో ఓ ఎంపీ ఇచ్చిన స్టేట్ మెంట్ సరిగ్గా ఇలాంటి ఉదంతాన్నే మరిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మంచి ఉద్యమ నేత, అంతకు మించి గొప్ప రాజనీతిజ్ఞుడు. ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు కూడా. ఐనప్పటికి ముఖ్యమంత్రి హోదాలో కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి గా చంద్రశేఖర్ రావు శక్తి సామర్ధ్యాలు అచంచలం ఐనప్పటికి వాటి గురించి అసందర్బోచితంగా చేసే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా అనిపిస్తుంటాయి తప్ప అంత సీరియస్ నెస్ ఉండదు.
భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలు అచ్చు ఇలాంటి పరిణామాలనే తలపిస్తున్నాయి. ఇంతకీ సదరు ఎంపీ గారు ముఖ్యమంత్రి నుండి ఏం ఆశించి ఈ వ్యాఖ్యలు చేసారో.. అసలు ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం..!!కేసీఆర్ వంటి స్థిరమైన ఆలోచన కలిగిన నాయకుడి ద్వారానే కశ్మీర్కు పరిష్కారం లభిస్తుందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్కు కేంద్రాన్ని ప్రభావితం చేసే అవకాశం వస్తే కశ్మీర్తోపాటు అయోధ్య రామమందిరం సమస్యకూ పరిష్కారం చూపగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. రామమందిరాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లతోనే భూమి పూజ చేయించగలరని వ్యాఖ్యానించారు.ఇలాంటి ప్రకటనలు శ్రుతి మించి చేసినట్టుగా అనిపించడం తప్ప మరో ప్రయోజనం ఉండదనే చర్చ జరుగుతోంది. రామమందిరం సంఘటన అనేక సంవత్సరాలనుండి అత్యున్నత న్యాయస్థానంలో నలుగుతోంది.
ఇక కాశ్మీర్ ది అంతర్జాతీయ సమస్య. రెండు దేశాల సరిహద్దు సమస్య. రెండు దేశాల ప్రజల సున్నితమైన మనోభావాలపై పెనవేసుకున్న సమస్య. ఇదే సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యున్నత న్యాయ స్థానం కూడా దీనిపై ద్రుష్టి కేంద్రీకరించింది. ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల స్పందించేప్పుడు కాస్త సంయమనం పాటించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పుకోసం ఏదంటే ఆ అంశంపై మాట్లాడితే నలుగురిలో స్థాయి తగ్గించుకోవడం తప్ప మరోటి కాదనే భావనలు కూడా వినిపిస్తున్నాయి.