తెలంగాణలో అన్లాక్ 1.0:తెరచుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, థర్మల్ గన్స్తో టెస్ట్
లాక్డౌన్ 5.0 నిబంధనల మేరకు సోమవారం నుంచి అన్నీ ప్రార్థన ఆలయాలు తెరుచుకున్నాయి. అన్ లాక్ 1.0 కింద ఆలయాలు, ప్రార్థన మందిరాలు ఓపెన్ చేశారు. అంతకుముందు ఆయా మందిరాలను శానిటైజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, దర్గా, మసీదు, చర్చ్లు తెరవగా.. భక్తులు వచ్చి పూజలు/ప్రార్థనలు చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరచుకున్నాయి. భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, కాళేశ్వర ముక్తేశ్వరాలయం, రామప్ప, సిద్దేశ్వరాలయం, కురవి వీరభద్రస్వామి, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాలు తెరిచారు. ఆలయ ప్రాంగణాల్లో భౌతికదూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. విధిగా మాస్క్ వేసుకోవాలని.. మాస్క్ ధరించినవారినే అనుమతిస్తామని స్పష్టంచేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాలు
లాక్డౌన్ వల్ల మార్చి 21వ తేదీ నుంచి ఆలయాల్లో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అన్ లాక్ 1.0తో నేటినుంచి ఆలయాలు తెరచుకుంటున్నాయి. భద్రాచలం రామాలయం, కొమరవెల్లి మల్లన్న, బాసర సరస్వతీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ధర్మపురి నర్సింహాస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, జోగుళాంబ ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో భక్తులకు మూడు అడుగుల గ్యాప్ ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు.
Recommended Video
థర్మల్ గన్స్ ద్వారా పరీక్షలు
ఆలయం ముందట భక్తునలను థర్మల్ గన్స్ ద్వారా పరీక్షిస్తారు. ప్రవేశ ద్వారంలోనే శానిటైజర్తో క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 65 ఏళ్లు దాటిన వృద్దులు, పదేళ్ల లోపు పిల్లలకు మాత్రం అనుమతించరు. అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థ ప్రసాదాల వితరణ, వసతి సౌకర్యం ఉండదు. కొనేటిలో స్నానం చేసేందుకు కూడా అనుమతించరు. కంటోన్మైంట్ జోన్లలో మాత్రం ఆలయాలు మూసివేసి ఉంటాయని అధికారులు తెలిపారు.