నాగం రాజీనామా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, బీజేపీకి వచ్చిన నష్టమేం లేదు: లక్ష్మణ్
హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు మెయిల్ ద్వారా నాగం జనార్దన్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించారు. ఈ విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాము పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా ఆయనకు పార్టీలో సముచిత స్థానం కలిపించామని చెప్పారు.
కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాగం పార్టీని వీడారని లక్ష్మణ్ తేల్చేశారు. టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ పోరాడడం లేదంటూ నాగం జనార్ధన్ రెడ్డి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని లక్ష్మణ్ అన్నారు.
తాము టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై పోరాటానికి కమిటీ వేసి.. దానికి నాగం జనార్దన్ రెడ్డిని ఛైర్మన్గా నియమించామని, అయినప్పటికీ నాగం చేసిన పోరాటం ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.