'రావెల కొడుకు తప్పుతో జగన్కేం సంబంధం, ఛీ..! బాలకృష్ణ అలాగా మాట్లాడేది'
హైదరాబాద్: ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు సుశీల్ తప్పు చేస్తే తమ పార్టీ అధినేత జగన్కు ఏం సంబంధమని వైసిపి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆదివారం నాడు ప్రశ్నించారు. జగన్ గురించి మంత్రి పదేపదే మాట్లాడటం అవివేకమని చెప్పారు.
మంత్రి కొడుకు బాధిత మహిళను వేధించిన దృశ్యం వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అయినా రావెల కిషోర్ బాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. మంత్రి తన కుమారుడికి బుద్ధి చెప్పకుండా కేసును వక్రీకరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలను తప్పు పట్టడం సరికాదన్నారు.
ఫుటేజీని మార్ఫింగ్ చేశారని మంత్రి కిషోర్ బాబు చెప్పడం దుర్మార్గమన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదన్నారు.
చంద్రబాబు వియ్యంకుడు, బాలకృష్ణ ఓ ఆడియో విడుదల కార్యక్రమంలో మహిళల గురించి నీచంగా మాట్లాడారన్నారు. అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలని, లేదంటే కడుపు అయినా చేయాలని బాలకృష్ణ మాట్లాడారని, ఓ ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడితే అన్నారు.
రాజకీయ ఒత్తిళ్లు లేవు: డిసిపి
ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ తనను వేధించాడంటూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు సుశీల్పై కేసు నమోదు చేశారు. ఇవాళ వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు.
ఈ కేసులో సుశీల్తో పాటు ఆయన డ్రైవర్ను అరెస్ట్ చేశామన్నారు. సంఘటన సమయంలో సుశీల్ కారులోనే ఉన్నారన్నారు. తనను సుశీల్ పట్టుకోవడానికి ప్రయత్నించాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
సుశీల్పై 354, 354 (నిర్బయ చట్టం), 509 భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. సుశీల్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచనున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల, బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నిందితులు ఎంతటి వారైనాసరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమన్నారు.
రావెల కిషోర్ కొడుకు కేసులో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తమకు సంబంధం లేదని, వాస్తవాల ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. దర్యాఫ్తు పారదర్శకంగా ఉంటుందన్నారు. బాధితురాలిని వెంబడించిన కారు మంత్రి రావెల కిషోర్ బాబుదేనని చెప్పారు.