2017 సివిల్స్ ఫలితాలు: తెలుగు విద్యార్థికి టాప్ ర్యాంక్, సీబీఐ మాజీ జేడీ కుమారుడికి 196
హైదరాబాద్: సివిల్ సర్వీస్ పరీక్ష-2017 ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. 2017, అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహించిన ఈ పరీక్షల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన అనుదీప్ దూరిశెట్టి తొలిస్థానంలో నిలిచి తన సత్తా చాటారు.
అనుదీప్ తన నాలుగో ప్రయత్నంలో ఈ ఘనతను సాధించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి మొత్తం 990 మంది పేర్లను ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్తో పాటు గ్రూప్-ఎ, గ్రూప్-బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపికచేసింది.
ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని యూపీఎస్సీ వెల్లడించింది. కాగా, మరికొంత మంది తెలుగువారికి కూడా మంచి ర్యాంకులు వచ్చాయి.
శీలం సాయి - 43, నారపురెడ్డి మౌర్య - 100, జి. మాధురి - 144, యెడవల్లి అక్షయ్ కుమార్- 624, వివేక్ జాన్సన్- 195, సాయి ప్రణీత్ - 196 (సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు), భార్గవ శేఖర్ - 816 (అనంతపురం జిల్లా సోమవారవాండ్లపల్లి) ర్యాంకులు సాధించారు.
మెట్పల్లికి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి మనోహర్, జ్యోతి దంపతుల పెద్ద కుమారుడే ఈ దూరిశెట్టి అనుదీప్. స్థానికంగా పదో తరగతి వరకు విద్యనభ్యసించిన అనుదీప్.. ఇంటర్లో హైదరాబాద్ శ్రీచైతన్యలో చదువుకున్నాడు. రాజస్థాన్లోని బిట్స్పిలానీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి సివిల్స్నే లక్ష్యంగా ముందుకు సాగాడు.
తొలిసారి 2011లో సివిల్స్ రాసినా నిరాశే ఎదురైంది. ఢిల్లీలో శిక్షణ కూడా తీసుకున్నాడు. రెండోసారి 790 ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. అయినా మెరుగైన ర్యాంకు కోసం ఐఆర్ఎస్ను వదులుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని మాదాపూర్లో సెంట్రల్ కస్టమ్స్ జీఎస్పీలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. కాగా, టాప్ ర్యాంక్ సాధించిన అనుదీప్పై కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.