ఉసురు తీసిన ఐపీఎల్ బెట్టింగ్.. డబ్బు చెల్లించలేక యువకుడి ఆత్మహత్య..
హైదరాబాద్ : కాలం మారుతోంది. అందుకు తగ్గట్లుగానే యువత ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. ఆ క్రమంలోనే అందని ద్రాక్షను సొంతం చేసుకునేందుకు దారి తప్పుతోంది. పర్యవేక్షణ లోపమో లేక ఫ్రెండ్స్ ప్రోద్భలమో తెలియదు కానీ.. చిన్నతనంలోనే పిల్లలు జల్సాలకు అలవాటు పడుతున్నారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. తల్లిదండ్రులు మాట వినక జీవితాన్ని నరకంగా మార్చుకున్నానన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్చిపోకముందే... అలాంటి సంఘటనే మరొకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
జల్సాలకు బానిసై... భవిష్యత్కు దూరమై... మృత్యుఒడికి చేరిన యువకుడు
ఉసురు తీసిన క్రికెట్ బెట్టింగ్
నాలుగు రోజుల క్రితం వరకు యూత్ అంతా ఐపీఎల్ ఫీవర్ ఊగిపోయింది. అయితే ఆ ఐపీఎల్ సందర్భంగా కాసిన బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. బెట్టింగ్లో ఓడిన డబ్బు నిర్వాహకులకు చెల్లించలేక.. విషయం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేక సతమతమైన ఆ యువకుడు చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చాడు.
బెట్టింగ్లో రూ.15వేలు కోల్పోయిన అఖిల్
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాం నగర్ కాలనీకి చెందిన దాసుకు ఇద్దరు కుమారుడు. వారిలో పెద్ద కొడుకు అఖిల్ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో బెట్టింగ్ కట్టిన అఖిల్.. 15వేల రూపాయలు ఓడిపోయాడు. ఆ డబ్బు చెల్లించమని బెట్టింగ్ నిర్వాహకులు ఒత్తిడి తేవడంతో డబ్బు కట్టలేక, ఇంట్లో వాళ్లకు విషయం చెప్పలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఫ్రెండ్స్ దగ్గర అప్పుచేసి రూ.10వేలు చెల్లించిన అఖిల్ మిగతా ఐదు వేలు కట్టలేక సతమతమయ్యాడు.
ఫోన్ లాక్కున్న బెట్టింగ్ నిర్వాహకులు
రూ.5వేల చెల్లించాలని ఒత్తిడి తెచ్చిన బెట్టింగ్ నిర్వాహకులు అఖిల్ సెల్ఫోన్ లాక్కున్నారు. తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తేనే మొబైల్ తిరిగి ఇస్తామని షరతు పెట్టారు. నాలుగు రోజులుగా ఫోన్ కనిపించకోవడంతో పేరెంట్స్ అఖిల్ను నిలదీశారు. దీంతో ఫోన్ ఫ్రెండ్స్ దగ్గర ఉందటూ అబద్దమాడాడు.
ఉరి వేసుకుని ఆత్మహత్య
మంగళవారం మార్నింగ్ వాక్కు వెళ్లే సమయంలో మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించి తండ్రి తాను తిరిగి వచ్చాక మొబైల్ ఏమైందో చెప్పాలని ఆదేశించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ యువకుడు బెట్టింగ్ వ్యవహారం బయటపడుతుందని ఆందోళనకు గురయ్యాడు. తండ్రి వచ్చేలోగా.. బెడ్ రూంలో తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు సూసైడ్ చేసుకున్న విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.