ఆడో, మగో తెలియని ఆ చిన్నారికి అమ్మానాన్నలు దొరికారు
హైదరాబాద్ : పెళ్లై ఏళ్లు గడిచినా పిల్లల్లేక నిత్యం నరకం అనుభవించే వాళ్లు ఎందరో. చిన్నారులను దత్తత తీసుకునేందుకు అనాథ శరణాలయాలు, స్టేట్ హోంల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతారు. అయితే వారంతా అందంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని అక్కున చేర్చుకునేందుకే మొగ్గుచూపుతారు. అలాంటిది పుట్టుకతోనే ఆడో మగో తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిని అక్కున చేర్చుకుంది ఓ అమెరికన్ జంట. చట్ట ప్రకారం దత్తత తీసుకుని అపూరూపంగా పెంచుకుంటోంది. ఇలాంటి చిన్నారిని దత్తత తీసుకోవడం తెలంగాణలో ఇదే తొలిసారి కావడం విశేషం.
స్త్రీ, పురుష జననావయవాలున్న బిడ్డ
సంగారెడ్డికి చెందిన దంపతులకు 2015లో ఓ బిడ్డ పుట్టింది. అయితే ఆ చిన్నారికి స్త్రీ, పురుష జననావయాలు ఉండటంతో బిడ్డను పెంచుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. హైదరాబాద్లోని శిశు విహార్లో వదలిపెట్టి వెళ్లారు. అప్పటి నుంచి ఆ చిన్నారి అక్కడే పెరుగుతోంది. ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్న ఆ బిడ్డకు శిశు విహార్ వారు నిత్య అని పేరు పెట్టారు. అందరితో కలివిడిగా ఉండే ఆ చిన్నారిని ఎవరూ దత్తత తీసుకోకపోవచ్చని అంతా భావించారు. అయితే అనుకోకుండా ఆ బిడ్డను అదృష్టం వరించింది.
దత్తత తీసుకున్న అమెరికా దంపతులు
ఆరు నెలల క్రితం అమెరికాకు చెందిన ఓ జంట ఓ చిన్నారిని దత్తత తీసుకునేందుకు భారత్కు వచ్చారు. హైదరాబాద్లోని శిశు విహార్లో ఉన్న నిత్య గురించి తెలుసుకుని తనని అడాప్ట్ చేసుకుంటామని చెప్పారు. వారి నిర్ణయం గురించి విని అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంటర్ సెక్స్ చైల్డ్ అని తెలిసి వారు దత్తత తీసుకునేందుకు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు వారికి చిన్నారిని అప్పగించారు. దీంతో బిడ్డలు లేక బాధపడుతున్న ఆ తల్లిదండ్రులు నిత్యతో కలిసి సంతోషంగా ఫ్లైట్ ఎక్కారు.
పదేళ్లు వచ్చాక ఆపరేషన్
చిన్నారిని దత్తత తీసుకున్న దంపతుల్లో తల్లి ఎనలిస్టుగా పనిచేస్తుండగా.. తండ్రి స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. నిత్యకు స్త్రీ, పురుష జననాంగాలు ఉండటంతో తనకు పదేళ్ల వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయించాలని నిర్ణయించారు. చిన్నారి అభిప్రాయం మేరకు తన లింగాన్ని నిర్థారించనున్నారు. నిబంధనల ప్రకారం దత్తత ఇచ్చిన మూడేళ్ల వరకు అధికారులు ఆ చిన్నారి బాగోగుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దత్తత ఇచ్చి ఆరునెలలు పూర్తైనందున ఈ నెలలోనే నిత్య కొత్త తల్లిదండ్రులు ఫస్ట్ రిపోర్టు పంపాల్సి ఉంది. వారు పంపే నివేదిక ఆధారంగానే నిత్యను వారితోనే ఉంచాలా లేక వెనక్కి రప్పించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.