అమెరికాలో ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించిన తెలంగాణ ఇంజినీర్ విడుదల
న్యూయార్క్: అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న హైదరాబాద్కు చెందిన ఆల్ఖైదా ఉగ్రవాది మొహమ్మద్ జుబేర్ ఇబ్రహీంను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. కరోనావైరస్ విజృంభిస్తున్న క్రమంలో అమెరికాలోని పలు జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
అలా గురువారం విడుదల చేసిన వారిలో జుబేర్ కూడా ఉన్నారు. జుబేర్ను జైలు నుంచి విడుదల చేసే క్రమంలో అమెరికా అధికారులు భారత విదేశాంగ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో జుబేర్ ఇబ్రహీంను అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చారు.
కాగా, ప్రస్తుతం ఛండీగఢ్లోని కరోనా క్వారంటైన్ కేంద్రంలో అతడ్ని ఉంచినట్లు తెలుస్తోంది. మొహమ్మద్ జుబేర్ ఇబ్రహీం అమెరికాలో ఆల్ఖైదా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు. యూఏఈలోని షార్జాలో జన్మించిన ఇబ్రహీం.. 1984లో హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది.
2001లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివాడు. అనంతరం అమెరికా వెళ్లాడు. అమెరికాలోనే ఉంటున్న జుబేర్ తండ్రి మొహమ్మద్ షేక్, అతని తండ్రి ఫరూక్ మొహమ్మద్లు ఆల్ఖైదాకు సన్నిహితంగా వ్యవహరించేవారు. ఇతడు కూడా ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు సేకరించాడు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడ్ని 2015లో అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో అతనిపై ఉన్న అభియోగాలు నిజమేనని తేలడంతో అమెరికా జైల్లోనే గడుపుతున్నాడు. తాజాగా అతడ్ని విడుదల చేసి భారత్కు పంపింది అమెరికా.