డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై బెంగ: తెలంగాణ వీరాభిమాని ట్రంప్ కృష్ణ మృతి: గుడి కట్టిన అభిమానం
మెదక్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. వరుసగా రెండోసారి అగ్రరాజ్యం పీఠాన్ని అధిరోహించడానికి డొనాల్డ్ ట్రంప్ సమరోత్సాహంతో కదులుతున్న సందర్భంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, తన అధికారిక నివాసం వైట్హౌస్కు తిరిగి వచ్చారు. కొద్దిరోజుల పాటు ట్రంప్ ఆసుపత్రి పాలు కావడం వల్ల ఎన్నికల ర్యాలీలు, డిబేట్లకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది. కరోనా నుంచి డిశ్చార్జి అయిన తరువాత.. ట్రంప్ తొలిసారిగా అభిమానుల ముందుకొచ్చారు.
Recommended Video
ఆయన అనారోగ్యానికి గురి కావడం.. మళ్లీ కోలుకోవడం వంటి పరిణామాలు తెలంగాణకు చెందిన ఓ వీరాభిమానికి భావోద్వేగానికి గురి చేశాయి. ఆ భావోద్వేగాన్ని తట్టుోకోలేకపోయిన ఆ అభిమాని గుండెపోటుకు గురయ్యారు. ఆదివారం మరణించారు. ఆయన పేరు బుస్సా కృష్ణ. వయస్సు 38 సంవత్సరాలు. స్నేహితులు, బంధువులు ఆయనను ట్రంప్ కృష్ణగా పిలుస్తుంటారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట్లో తన ఇంటిముందు ట్రంప్కు నిలువెత్తు గుడిని కట్టి, నిత్యపూజలు చేస్తుంటారు. తెల్లవారగానే.. ట్రంప్ విగ్రహానికి పూజ చేసిన తరువాతే ఏ కార్యక్రమాన్నయినా చేపట్టేంత డైహార్డ్ ఫ్యాన్ ఆయన.
తన జేబులో ఎప్పుడూ ట్రంప్ ఫొటోను వెంట పెట్టుకుని తిరుగుతుంటారు. తాను ఆరాధించే డొనాల్డ్ ట్రంప్కు కరోనా వైరస్ సోకిందనే వార్తను ఆయన జీర్ణించుకోలేకపోయారని, తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని తన మామ నివాసంలో బుస్సా కృష్ణ మృతిచెందారు. ఈ ఉదయం డొనాల్డ్ ట్రంప్.. వైట్హౌస్ బాల్కనీ నుంచి అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.
దీన్ని టీవీల్లో చూసిన తరువాత బుస్సా కృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ట్రంప్ కోలుకున్నారనే వార్తను తన స్నేహితులకు ఫోన్ ద్వారా వెల్లడించారని పేర్కొన్నారు. అదే సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయినట్లు చెప్పారు. టీవీ చూస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.