టెక్కీ కూచిభొట్ల హత్య కేసులో మరో ట్విస్ట్: తాను చంపలేదంటూ నిందితుడు
వాషింగ్టన్/హైదరాబాద్: అమెరికాలో జాతి వివక్ష దాడిలో దారుణంగా హత్యకు గురైన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూచిభోట్ల శ్రీనివాస్ హత్యకేసు మరో మలుపు తిరుగతోంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆడమ్ పూరింటన్ తాను నిరాపరాధినంటూ ఓ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
అయితే ఫెడరల్ ప్రాసెక్యూటర్ మాత్రం పురింటన్ కావాలనే శ్రీనివాస్, అలోక్ మాదసానిలపై దాడికి పాల్పడ్డాడని చెప్పారు. 24ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యాడని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం తొలివాదనలు జరగగా.. తదుపరి విచారణను వచ్చే ఏడాది మే నెలకు వాయిదా వేశారు.
కాన్సాస్లో ఘటన
సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితుడికి శిక్ష పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా నేవీ మాజీ ఉద్యోగి ఆడమ్ పూరింటన్ (51)ను కాన్సాస్ సిటీ బార్లో కూచిబొట్ల శ్రీనివాస్ కాల్చిచంపటంతోపాటు మరో ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచాడు.
జాతి వివక్ష దాడే..
జాత్యాంహకార దాడి, మారణాయుధాలు కలిగి ఉండటం అనే అభియోగాలు పూరింటన్పై నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ కాల్పుల ఘటనను జాతి వివక్ష దాడిగా విచారణ చేపట్టినట్లు అమెరికా న్యాయశాఖ ఇప్పటికే ప్రకటించింది.
మీ దేశానికి వెళ్లిపోండంటూ..
తుపాకీతో కాల్పులు జరిపే ముందు ‘మీ దేశానికి వెళ్లిపోండి' అంటూ పూరింటన్ అరుపులు, కేకలు పెట్టినట్లు ప్రత్యక్షసాక్ష్యులు ఇప్పటికే వెల్లడించారు. ఇది ముమ్మాటికీ జాత్యహంకార దాడేనని చెప్పారు.
నిందితుడికి ఉరిశిక్షే..
అభియోగాలు రుజువై దోషిగా తేలితే పూరింటన్కు ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న విషయం తెలిసిందే.