షాకింగ్: 'హైదరాబాద్ సీమాంధ్రులకు టిక్కెట్లు, టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవద్దని ఎక్కడా లేదు'
హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లో సెటిలర్లయిన సీమాంధ్రులకు టికెట్లు ఇస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ బుధవారం అన్నారు. ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఈసారి సెటిలర్లు కాంగ్రెస్ వైపే ఉంటారన్నారు.
హైదరాబాద్లోని సెటిలర్స్ నేతలతో మాట్లాడుతున్నామని, కొన్నిచోట్ల సీమాంధ్ర నేతలకు టికెట్లు ఇస్తామని, అధిష్టానం కూడా అంగీకరించిందని, కాంగ్రెస్పై వారికి గతంలో ఉన్న కోపం లేదు కాబట్టి ఈసారి సెటిలర్స్ తమవైపే ఉంటారన్నారు. పాతబస్తీలో మజ్లిస్ పైన బలమైన అభ్యర్థులను నిలబడెతామన్నారు.
మజ్లిస్ పార్టీకి బీజేపీతో రహస్య ఒప్పందాలున్నాయని, అందుకే బలమైన మైనార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ తమ విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరన్నారు.
టీడీపీతో పొత్తుపై మాట్లాడుతూ.. అవును... టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని ఎక్కడా లేదుగా అన్నారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల టీడీపీకి ఓటు బ్యాంకు ఉందని, అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. ఇకపోతే, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన చాలామంది నేతలు మళ్లీ వస్తామని చెబుతున్నారన్నారు.
దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన కాంగ్రెస్ నేతలంతా పదవుల నుంచి తప్పుకుంటుండంపై ఉత్తమ్ స్పందించారు. నిజానికి రాహుల్ గాంధీ సీనియర్లను తప్పుకోమనలేదని, యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని మాత్రమే సూచించారన్నారు.