కేసీఆర్ మూఢనమ్మకాలతో క్రిమినల్ చర్యలు, దోషులుగా నిలబెడతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా మరణాలపై ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని అన్నారు. తమ పరిధిలో కరోనాతో చనిపోయిన వారి వివరాలను గాంధీభవన్కు అందజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కరోనాతో చనిపోయిన పేదలకు రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.
కేసీఆర్ మూఢనమ్మకాలతో..
సచివాలయంలోని అతి పురాతన దేవాలయం, మసీదును కూల్చడం కేసీఆర్ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని విమర్శించారు. కేవలం తన మూఢనమ్మకాల కోసం వీటిని కూల్చివేయించారని కేసీఆర్పై మండిపడ్డారు. ఈ అంశాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళతామని చెప్పారు.
క్రిమినల్ చర్య.. ఒవైసీ సోదరుల మౌనం ఎందుకు?
సచివాలయంలో దేవాలయాన్ని, మసీదు కూల్చివేతపై న్యాయం కోసం ఎంతవరకైన పోరాటం చేస్తామని, ఇది క్రిమినల్ చర్య అని అన్నారు. దీన్ని పార్లమెంటులో సైతం లేవనెత్తుతామన్నారు. ఈ విషయంలో కేసీఆర్తో ఒవైసీ సోదరులు ఏం ఒప్పందం చేసుకుని మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. ఎంఐఎంను ఈ విషయంలో ప్రజల్లో దోషులుగా నిలబెడుతామన్నారు. ఆగస్టు 22న అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఉత్తమ్ తెలిపారు.
బస్తీ దవాఖానాల పేరుతో నాటకాలు.. కేసీఆర్కు సవాల్
జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, ఖమ్మం ఎన్నికలనూ సీరియస్గా తీసుకుంటున్నామన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లతో గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. అందుకే బస్తీ దవాఖానాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. గ్రేటర్లో డబుల్ బెడ్ రూమ్కు అర్హులైన వారికి ఒక్క శాతం ఇళ్ల నిర్మాణం జరిగినా తాము ఎన్నికల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు.
200 కోట్లు మురిగిపోయేలా..
అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారం నుంచి దిగి పోయేనాటికి ఉస్మానియా ఆస్పత్రికి రెండు వందల కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ డబ్బులను మురిగిపోయేలా చేశారని, ఒక్క రూపాయి కూడా విదల్చలేదని మండిపడ్డారు.