'భారత్ను చైనా ఓడించలేదు, కానీ యుద్ధం వస్తే.., మోడీ పర్యటనతో అనుకున్నా'
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆయన గతంలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా పని చేశారు.
హైదరాబాద్: భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆయన గతంలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా పని చేశారు. ఈ నేపథ్యంలో తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.
చదవండి: మీతో చర్చలా, ఎవరు అడిగారు?: చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్
భారత్, చైనాల మధ్య యుద్ధం మొదలై, అణుబాంబుల దాడి చేసేవరకు వెళ్తే మాత్రం రెండు దేశాలకు తీరని నష్టమని చెప్పారు. యుద్ధంలో భారత్ మీద చైనా విజయం సాధించడం అంత సులువు ఏమీ కాదని చెప్పారు.
చదవండి: రెచ్చిపోతున్న చైనా: పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా.., ఇది ప్లాన్!
1962 కంటే మన బలం పెరిగింది
1962లో భారత సైన్యం సంఖ్య చాలా తక్కువ అని ఉత్తమ్ చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దాడిని ఎంతో దీటుగా ఎదుర్కునే స్థితిలో ఉన్నాయని చెప్పారు.
చైనాకు ఆయుధ సంపత్తి ఎక్కువ ఉన్నా..
మనకన్నా చైనాకి ఆయుధాలు, శత్రువులపై దాడిచేసే అత్యాధునిక ఆయుధ సంపత్తి అధికంగానే ఉన్నప్పటికీ, భారత్ను ఓడించడమంటే అంత తేలికకాదని చెప్పారు. గతానికి, ఇప్పటికి భారత్, చైనా సైనిక శక్తిలో ఎంతో తేడా ఉందని, యుద్ధంలో శత్రువులను ధ్వంసం చేసే శక్తిమంతమైన ఆయుధాల పవర్ ఆనాటికీ ఈనాటికీ వందల రెట్లు పెరిగిందన్నారు.
కానీ ఇరు దేశాలకు కోలుకోలేని దెబ్బ.. మనోళ్లు సిద్ధమే
దీంతో యుద్ధం జరిగితే ఇరు దేశాలు కోలుకోలేని దెబ్బ తింటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఒకవేళ చైనా యుద్ధానికి రెడీ అంటే మనవాళ్లు ఏ మాత్రం తగ్గకుండా రెడీ అంటూ పోరాడుతారని చెప్పారు.
మోడీ పర్యటనతో అలా అనుకున్నా
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్లడంతో కంగారు పడిపోయిన చైనా మన దేశంపై బెదిరింపులు చేస్తోందని ముందు తాను భావించానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ, ఆ దేశం వివాదాన్ని తగ్గించుకోకుండా వరుసగా పలు వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతుండడం చూస్తుంటే చైనా ఉద్దేశం మోడీ అమెరికా పర్యటన మాత్రమే కాదని తెలుస్తోందన్నారు. మరోవైపు భూటాన్ను చైనా అస్సలు లెక్క చేయడం లేదన్నారు.
చైనాది తీవ్ర పదజాలం
భారత్తో వివాదం నేపథ్యంలో చైనా చాలా తీవ్రమైన భాషను వాడుతోందని ఉత్తమ్ అన్నారు. చైనా బెదిరింపుల ధోరణికి దిగుతోందని చెప్పారు. చైనా వరుసగా చేసిన వ్యాఖ్యలు అలజడి రేపేలా ఉన్నాయన్నారు. చైనా తీరుపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల అనంతరం మళ్లీ వెంటనే చైనా పలు వ్యాఖ్యలు చేసిందన్నారు. భారత్ ఇప్పుడు 1962 యుద్ధ సమయం నాటి దేశం కాదని అరుణ్ జైట్లీ అంటే, అందుకు ఆ దేశం.. తమది కూడా అప్పటిలాంటి దేశం కాదంటూ వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. ఇవన్నీ మంచి సంకేతాలు కావన్నారు.