ఐయామ్ ఉత్తమ్.. ఐయామ్ పవన్!: ఎట్ హోంలో నవ్వులు పూయించిన సంభాషణ
ఐయామ్ ఉత్తమ్.. ఐయామ్ పవన్ అంటూ ఒకరినొకరు పరిచయం చేసుకోవడం పక్కనే ఉన్న నేతలకు నవ్వు తెప్పించింది.
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రవేశం చేసి మూడేళ్లు పూర్తయినా.. పూర్తి స్థాయి సమయం కేటాయించకపోవడం వల్ల చాలామంది రాజకీయ నాయకులతో ఆయనకు సరిగా పరిచయాలు కూడా లేవు.
త్వరలోనే ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి దిగుతుండటంతో ఇక నుంచి ఆ వాతావారణానికి అలవాటు పడేందుకు ఇప్పుడిప్పుడే అందరితో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు పవన్ హాజరయ్యారు. ఎట్ హోం కార్యక్రమంలో ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తొలిసారిగా పవన్ ఇలాంటి కార్యక్రమానికి హాజరుకావడంతో.. చాలామంది నేతలతో ముఖాముఖి మాట్లాడే అవకాశం వచ్చింది. ఇదే క్రమంలో ఎట్ హోం కార్యక్రమానికి విచ్చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, జనసేనాని పవన్ ల మధ్య పరిచయ సంభాషణ అక్కడ నవ్వులు పూయించింది.
రాజ్భవన్లోకి ప్రవేశించగానే ఉత్తమ్కు పవన్ తారసపడటంతో.. తనకు తానుగా పరిచయం చేసుకున్నారు. ఐయామ్ ఉత్తమ్ అంటూ ఆయన కరచాలనం చేయగా.. ఐయాం పవన్ అంటూ జనసేనాని స్పందించారు. ఇలా వీరిద్దరు పరిచయం చేసుకున్న తీరు చూసి అక్కడే ఉన్న ఇతర నేతలు ఒక్కసారిగా నవ్వుకోవడం కనిపించింది.