టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపై క్లారిటీ: రేపు చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ, ‘లోకేష్! బాధ్యతగా ఉండు’
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. పొత్తులపైనా పావులు కదుపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై స్పష్టతనిచ్చారు.
చంద్రబాబు భేటీ తర్వాత స్పష్టత
టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శనివారం హైదరాబాద్లో చర్చలు జరుపనున్నామని చెప్పారు.
లాబీయింగ్ అవసరం లేదు
కేసీఆర్ వంటి నియంత పాలనలో తెలంగాణ ప్రజలు మగ్గకుండా ఉండాలంటే టీడీపీ సహా మిగితా పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. టికెట్ల కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదన్న ఉత్తమ్.. అధిష్టానం నిర్ణయం మేరకు అభ్యర్థుల ఇంటికే బీఫారాలు పంపిస్తామని తెలిపారు.
ఏపీ మంత్రి లోకేష్పై ఈటెల ఆగ్రహం
టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి నారా లోకేష్పై తెలంగాణ అపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ' ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఈటెల అన్నారు.
లోకేష్.. బాధ్యతగా వ్యవహరించు..
మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా, హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని నారా లోకేష్కు హితవు పలికారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాజాకార్య రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందన్న ఆంధ్ర నాయకులు ఏమయ్యారో ప్రజలకు తెలుసని ఈటెల అన్నారు. ప్రస్తుతం ప్రశాంతమైన అభివృద్ధి ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతోందని అన్నారు.