కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదు: అన్నీ బయటపెడతామన్న ఉత్తమ్
హైదరాబాద్: కేసీఆర్ సవాళ్లపై తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ కుమార్ రెడ్డి స్పందించారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహా ఒప్పందంలో కుట్రల్ని రేపు బయటపెడతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు.
మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందాన్ని మహా దగా ఒప్పందంగా అభివర్ణించారు. కేసీఆర్ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని ఆయన అన్నారు. కేసీఆర్ చెప్పిన కోటి ఎకరాల లెక్కలు ఖాకీ లెక్కలని అన్నారు. ఇవన్నీ భోగస్ లెక్కలని తేల్చేశారు. తాను సైన్యంలో పనిచేసివచ్చానని, ఎవరికి భయపడేది లేదని అన్నారు. '83 వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ ప్రాజెక్టులు కడుతున్నామంటున్నారు.
ఇంత ప్రజాధనాన్ని ఎలా ఖర్చుచేస్తున్నారో వెల్లడించండి' అంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన నిలదీశారు. '158 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన ప్రాజెక్టును 148 మీటర్లకు పరిమితం చేస్తూ ఒప్పందం చేసుకొచ్చి...సంబరాలు చేసుకుంటావా? ఇందులో ఏమైనా హేతుబద్ధత ఉందా?' అని ఆయన నిలదీశారు.
గతంలో 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మిస్తామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్దని చెప్పారని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఆయన మహారాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, తెలంగాణకు ప్రయోజనం కలిగేలా ఎలా ఒప్పందం చేసుకుని ఉంటారో ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఏ కాంట్రాక్టర్ తో మాట్లాడినా వాస్తవాలు వెల్లడి అవుతాయని ఆయన చెప్పారు. ప్రాణహిత, చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో 26 వేల కోట్ల రూపాయల నుంచి 70 వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెంచినప్పుడు గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.సెంట్రల్ వాటర్ కమిషన్ 160 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని అనుమతులిస్తే, తెలంగాణ సీఎం కేసీఆర్ 240 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తామంటున్నారని ఆయన తెలిపారు.
సరే పోనీ మీరంటున్నట్టే 240 టీఎంసీల నీటినే తెలంగాణకు తీసుకొస్తారని తాము కూడా అంగీకరిస్తున్నామని అన్నారు. అలా అంగీకరించిన 240 టీఎంసీల నీటిలో 40 టీఎంసీల నీరు స్వీపేజ్ ఎవాపరేషన్ లో పోయిన తరువాత, 30 టీఎంసీల నీరు హైదరాబాదు నగరానికి నీటి కేటాయింపుల్లో ఇస్తారని, ఈ మొత్తం నీటిని మినహాయించిన తరువాత, 10 టీఎంసీలు విలేజ్ డ్రింకింగ్ వాటర్ అవసరాలకు కేటాయిస్తారని, ఆ మొత్తం నీటిని మినహాయించిన తరువాత, 16 టీఎంసీలు ఇండస్ట్రీలకు కేటాయిస్తారని అన్నారు.
ఇవన్నీ పోగా సాగునీటి అవసరాలకు మిగిలేది 144 టీఎంసీల నీరుని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం లేదా ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం చూసినా ఒక టీఎంసీ నీటికి వరి లేదా ఇతర ఆరు తడి పంటలు 12 వేల ఎకరాలు, ఇతర నీటి ఆధారిత పంటలు 8 నుంచి 10 వేల ఎకరాల మధ్యలో సాగు చేసుకోవచ్చని, ఈ లెక్కన మిగిలిన నీరు 144 టీఎంసీలకి 14 1/2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉండగా, పదేపదే ఆ లెక్కలు 26 లక్షల ఎకరాలను సాగు చేస్తామంటారు.
ఇదెలా సాధ్యమని ఆయన నిలదీశారు. మరోసారి 36 లక్షల ఎకరాలు సాగు చేస్తామని చెబుతారు. అదెలా సాధ్యమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై ఎలాంటి చర్చలకైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తుని మహారాష్ట్రలో తాకట్టు పెట్టి సంబరాలా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ బెదిరింపు మాటలు మాట్లాడారని వాటికి ఎవరూ బెదిరేది లేదని ఆయన అన్నారు. విపక్షాన్ని లేకుండా చేస్తామని చెప్పడం, కేసీఆర్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు.