హుజూర్ నగర్ పోరు .. టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు, ఎన్నికల అధికారులు .. ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. హుజూర్నగర్ ఎన్నికల సమయంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత కలిగిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఒకింత లాభం కలిగించే అంశంగా పరిణమించింది. అయినప్పటికీ అధికార పార్టీ కావడంతో టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
టిఆర్ఎస్ కు బిగ్ షాక్ ,29 న మోడి సమక్షంలో బిజేపిలో చేరనున్న జితేందర్ రెడ్డి
ప్రభుత్వ యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారని, తమ తొత్తులుగా పని చేయించుకుంటున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎన్నికల అధికారులు, ఇటు పోలీసులు సైతం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలాగా పని చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడుతున్నారు. ప్రస్తుత రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న చంద్రయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు.
ఆయనపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక గతంలో ఎస్ పి వెంకటేశ్వర్లు పైన కూడా లిఖితపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పోలీసులు సైతం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలాగా ప్రవర్తిస్తూ ప్రజల మీద టీఆర్ఎస్ కు ఓటేసేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఎంతకైనా బరితెగిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల తీరు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు.