కేసీఆర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ, ఇంకెన్ని దారుణాలు చూడాలో: విజయశాంతి
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రారంభమయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్సీలను తెరాసలో చేర్చుకోవడం, ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తుండటం, పంచాయతీరాజ్ వ్యవస్థ తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి, మరో నేత పొంగులేటి సుధాకర్ రెడ్డిలు నిప్పులు చెరిగారు.
పంచాయతీ ఎన్నికలపై ఉత్తమ్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 15న తీసుకువచ్చిన పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ను అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా తీసుకు వచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమని మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ గణన చేసి ఏ, బి, సి, డి కేటగిరీల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇటీవల తొలగించిన ఓటర్ల పేర్లు తిరిగి నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని చెప్పారు.
ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారని విజయశాంతి అన్నారు. తెలంగాణలో అరాచకాలను ప్రజలు ఎప్పటికీ సహించబోరని చెప్పారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అన్యాయంగా తెరాసలోకి లాక్కున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే యథారాజా తథా ప్రజ అన్నట్లుగా ఉందని చెప్పారు.
చంద్రబాబు చెబితే నమ్మరు, కేసీఆర్కు తీరికలేదు
పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెబితే తెలంగాణలో ప్రజలు నమ్మే పరిస్థితి లేరని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తీరిక లేదని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
పోలవరం ప్రాజెక్టు రీడిజైన్ కోసం డిమాండ్ చేయాలి
అఖిలపక్షాన్ని ప్రధాని దగ్గరకు తీసుకెళ్తానన్న కేసీఆర్ మాట తప్పారని పొంగులేటి నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు రీ డిజైన్ కోసం డిమాండ్ చేయాలన్నారు. తామేమీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ముంపు నుంచి భద్రాద్రిని కాపాడుకోవాలన్నారు. పునర్విభజన చట్టం అమలులో కేంద్రం విఫలమైందన్నారు.