ఊహించని రాజకీయ ప్రకంపనలు: కూటమిపై ఎల్ రమణ, అసంతృప్తులకు పదవులు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో సీట్ల అంశం కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తెలంగాణ జన సమితి కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ అధినేత కోదండరాంను కలిశారు. సీట్ల అంశంపై చర్చించారు. అనంతరం ముగ్గురు మీడియాతో మాట్లాడారు.
ఎవరూ ఊహించని విధంగా కూటమి ఏర్పడిందని ఎల్ రమణ చెప్పారు. ఊహించని రాజకీయ ప్రకంపనలు వచ్చాయన్నారు. వార్ వన్ సైడ్ అవుతుందని తెరాసకు వణుకు పుడుతోందని చెప్పారు. ఎన్నికలను మహాకూటమి కలిసికట్టుగానే ఎదుర్కొంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కూటమి మనుగడపై సందేహాలు అవసరం లేదన్నారు.
వార్ వన్ సైడేనా?: మహాకూటమి వైపు తాజా జాతీయ సర్వే, టిక్కెట్ల కోసం రచ్చరచ్చ
అధికారంలోకి రాగానే టిక్కెట్లు రాని వారికి పదవులు
టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐలతో కలిసి కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుందని, ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలోను అందరికీ భాగస్వామ్యం ఉంటుందని ఉత్తమ్ చెప్పారు. కూటమిపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని చెప్పారు. పొత్తుల వల్ల అన్ని పార్టీలలోను ఆశావహులందరికీ టిక్కెట్ రాకపోవచ్చునని, అధికారంలోకి రాగానే టిక్కెట్లు దక్కని వారికి తగిన గౌరవం దక్కుతుందని, పదవులు వస్తాయని చెప్పారు. అన్ని పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. సీట్లు దక్కని కూటమి పార్టీలోని కీలక నేతలకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు.
ఆ బాధ్యత కోదండరాంది
కాంగ్రెస్ పార్టీ సీట్లతో పాటు మిత్రపక్షాల సీట్లను త్వరలో ప్రకటిస్తామని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆఱ్ కుటుంబం నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా మా కూటమి ముందుకు వెళ్తోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనే ప్రధాన అజెండాగా కూటమి ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కమిటీ ఛైర్మన్గా ఎన్నికలకు ముందు, తర్వాతా ఆచార్య కోదండరాం ఉంటారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర మరువలేనిదని చెప్పారు.
ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందో చెబుతాం
అమరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరిచిందని ఉత్తమ్ అన్నారు. మోడీ, కేసీఆర్ కుమ్మక్కై ముందస్తుకు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను, మైనార్టీలను మోసం చేసే కుట్ర అన్నారు. తుమ్మడిహట్టి వద్ద తట్టెడుమట్టి మోయలేని మీరా ప్రాజెక్టులు కట్టేది అని నిలదీశారు. మీరు కట్టిన ఏ ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ప్రశ్నించారు. ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుందనేది నోటిఫికేషన్కు ముందు విడుదల చేస్తామన్నారు.
లోకసభలో మోడీతో కలిసి వెళ్లేందుకే
కేసీఆర్ పాలనలో మేలు జరగలేదనే భావన ప్రజల్లో ఉందని, కోదండరాం పట్ల అవమాన వైఖరిని సమాజం మొత్తం ఖండిస్తోందని, హరగోపాల్, గద్దర్, విమలక్క త్యాగస్ఫూర్తితో పని చేసినా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అవమానించారని ఉత్తమ్ ఆరోపించారు. ఉద్యమంలో 1200 మంది చనిపోయారని కేసీఆర్ పదేపదే చెప్పారని, కానీ వారికి న్యాయం జరగలేదన్నారు. తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. లోకసభ ఎన్నికల్లో మోడీతో పొత్తు కోసం మైనార్టీలను మోసం చేసి మాయమాటలతో ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు.