ఒవైసీ.. షాకింగ్: అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నాహాలు: అభ్యర్థి పేరు సైతం ప్రకటన
హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ముందస్తు సన్నాహాలు చేపట్టారు. అసెంబ్లీలో ఇప్పుడున్న స్థానాల సంఖ్యను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఓం ప్రకాష్ రాజ్భర్ సారథ్యంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో మజ్లిస్ సీట్లు సర్దుబాటు చేసుకోనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు: నిమ్మగడ్డతో భేటీకి జగన్ సర్కార్కు డెడ్లైన్
యూపీ ఎన్నికల కోసం అభ్యర్థి పేరు..
ఇందులో భాగంగా మొట్టమొదటి అభ్యర్థి పేరును కూడా అసదుద్దీన్ ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నామని ఇదివరకే వెల్లడించన అసదుద్దీన్ ఒవైసీ.. భావసారూప్యం గల పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైనా ఆయన ఫోకస్ పెట్టారు. తాజాగా- ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాపై ఆయన కసరత్తు చేస్తున్నారు. తొలి అభ్యర్థిని ప్రకటించారు.
కంటి డాక్టర్ను
యూపీ బల్రామ్ పూర్ జిల్లాలోని ఉట్రౌలా అసెంబ్లీ స్థానానికి పోటీ చేయబోయే అభ్యర్థి పేరును అసదుద్దీన్ ఒవైసీ తాజాగా వెల్లడించారు. ఉట్రౌలా స్థానంలో డాక్టర్ అబ్దుల్ మన్నన్ను నిలబెట్టినట్లు తెలిపారు. అబ్దుల్ మన్నన్.. కంటి డాక్టర్. ఆయన పీస్ పార్టీ ఆఫ్ ఇండియాలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఆ పార్టీకి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. కొద్దిరోజుల కిందటే ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. మజ్లిస్ పార్టీలో చేరారు.
బీజేపీ కోటపై
హైదరాబాద్లోని దారుస్సలాంలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో అసదుద్దీన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. తాజాగా ఆయన పేరును ఉట్రౌలా అసెంబ్లీ స్థానం కోసం ఖరారు చేసినట్లు అసదుద్దీన్ తెలిపారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం బీజేపీ ఆధీనంలో ఉంది. 2017 నాటి ఎన్నికల్లో బీజేపీ అబ్యర్థి రామ్ ప్రతాప్ అలియాస్ శశికాంత్ వర్మ ఇక్కడి నుంచి విజయం సాధించారు. సమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఆరిఫ్ అన్వర్ హష్మీని 29 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు పైనా..
కాగా- బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే. ఏకంగా అయిదు స్థానాలను కొల్లగొట్టింది. తెలంగాణ కాకుండా మరో ఉత్తరాది రాష్ట్రంలో అయిదు స్థానాల్లో విజయం సాధించడం సంచలనం సృష్టించింది. అదే ఊపును వచ్చే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొన సాగించడానికి ఒవైసీ కసరత్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో పోటీ చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీథి మయ్యంతో పొత్తు పెట్టుకోవచ్చని తెలుస్తోంది.