"ఒళ్లు దగ్గర పెట్టుకో కేసీఆర్" ; టీఆర్ఎస్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం : రేవంత్
హైదరాబాద్ : ఒళ్లు దగ్గరపెట్టుకోవాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సింది తాను కాదని కేసీఆరే అని కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కాగా, జిల్లాల విభజనకు ముందొక మాట.. విభజన జరిగిన తర్వాత మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదివారం నాడు కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. కేసీఆరే ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని కౌంటర్ ఎటాక్ చేశారు ఉత్తమ్. రాజకీయం సంస్కారం తెలియని కేసీఆర్.. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం సరైంది కాదన్నారు.
ఇక దేశంలో కేసీఆర్ లాంటి సీఎం మరెక్కడా లేడని ఆరోపించిన ఉత్తమ్.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనను ప్రజలు 'తుగ్లక్ పాలన' గా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటును తామెప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే అశాస్త్రీయంగా జిల్లాల విభజనను చేపట్టడాన్ని మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రయోజనాల కోసమే: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియంతా సీఎం కేసీఆర్ కు రాజకీయ లబ్ది చేకూర్చే విధంగానే సాగిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. సొంత రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో తెలంగాణ సర్కారు తీరుపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు రేవంత్. రాష్ట్రంలో దళిత, గిరిజన నేతల ఎదుగుదలను అడ్డుకునే విధంగా టీఆర్ఎస్ పాలన ఉందని ఆరోపించారాయన.