ఫైర్ మీదున్న వీహెచ్ .. తెలంగాణా సర్కార్ తప్పులను ఎత్తి చూపటంలో వీహెచ్ స్టైలే వేరు ..
తెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ పై మాట్లాడటానికి చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు వెనకడుగు వేస్తున్నారు. కేసీఆర్ తో ఎందుకొచ్చిన గొడవ అంటూ దూరంగా ఉంటున్నారు. పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపటానికి కూడా ఎవరూ సాహసించటం లేదు. ఇక మీడియా సైతం తెలంగాణా ప్రభుత్వ లోపాలను ప్రజల ముందు పెట్టలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ అయితే ఏంటి ? కేటీఆర్ అయితే ఏంటి ?నాకేమైనా భయమా? అంటూ ప్రజలకోసం , ప్రజల తరపున తన గళం వినిపించటానికి ముందుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ .తాజాగా వరుసగా టీఆర్ఎస్ సర్కార్ ను ,కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ ఆయన వరుస వాగ్బాణాలు సంధిస్తున్నారు. తాత వయసులో ఉన్న కాకా మంచి ఫైర్ మీదున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ను ఏకిపారేస్తున్నారు.
ఆదిలోనే హంసపాదు..! స్టాలిన్ తో కేసీఆర్ భేటీ ఉండదు..!!
టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై గళం విప్పిన వీహెచ్ ... ఈ మధ్య వరుస సంచలనాలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ. హన్మంతరావు నోరు విప్పారు. విద్యార్థులు చనిపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆరే కారణమని ఆయన ఆరోపించారు. వీరిద్దరిపై వెంటనే మర్డర్ కేసు పెట్టాలని సంచలన వ్యాఖ్య చేశారు. ఇక ఆ తర్వాత వీహెచ్ సంచలనాల పరంపర కొనసాగింది. గ్లోబరీనా మీద క్రిమినల్ కేసులు పెట్టాలని , గ్లోబరీనా తెలీదని పెద్దమ్మ గుడిలో ప్రమాణం చెయ్యాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు.
కేటీఆర్ ను టార్గెట్ చేసిన వీహెచ్ .. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలపై కీలక వ్యాఖ్యలు
ఇక అంతటితో ఆగక పెద్దమ్మ గుడికెళ్ళి మరీ కేటీఆర్ కోసం ఎదురు చూసిన ఆయన కేటీఆర్ పెద్దమ్మ గుడికి రాలేదని, గ్లోబరీనాతో కేటీఆర్ కు సంబంధం ఉందని చెప్పారు. టీఆర్ఎస్ పాలన అంతం కావాలని పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నా అని ప్రకటన చేశారు. ఇక వీహెచ్ పెద్దమ్మ గుడికి రావాలని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించి బఫూన్ పిలిస్తే వెళ్ళాలా .. అన్న వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు . నీ అయ్యకు రాజకీయ భక్ష పెట్టిన వాడిని .. నన్నే బఫూన్ అంటావా అంటూ మండి పడ్డారు.
హాజీపూర్ ఘటన, అంబేద్కర్ విగ్రహ ద్వంసం , ఫెడరల్ ఫ్రంట్ అంశాలపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
ఇక తాజాగా సీఎం కేసీఆర్ కేరళ టూర్ సందర్భంగా స్పందించిన వీహెచ్ తెలంగాణా రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతే ఆ కుటుంబాలను పలకరించే దిక్కు లేదు కానీ ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశం అంతా తిరుగుతారట అని మంది పడ్డారు. అంతే కాదు హాజీపూర్ లో జరిగిన బాలికల హత్యలపైన కూడా వీహెచ్ స్పందించారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ స్థానికులతో వివరాలు కనుక్కున్న వీహెచ్ టీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, బాలికలకు రక్షణ లేదని పేర్కొన్నారు.సైకో కిల్లర్ శ్రీనివాస రెడ్డిని ఉరి తీయాలని , ఎన్ కౌంటర్ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. అసమర్థ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. అంతే కాదు అంబేద్కర్ విగ్రహ ద్వంసం , డంప్ యార్డులో లభ్యమైన ఘటనపైన కూడా తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. కేసీఆర్ గురించి ఏపీ ప్రజలకు కూడా తెలియాలని ఆయన ఏపీలో నిరసన తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
యువ నాయకులను మించి లేటు వయసులో కూడా కాకా దూకుడు
తెలంగాణా రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పైన , కేసీఆర్, కేటీఆర్ లపైన మాట్లాడాలంటే యువ రాజకీయ నేతలే ఎందుకు వచ్చిన గొడవ అని తగ్గి ఉంటున్న సమయంలో తనకు అలాంటి భయమేదీ లేదని వీ హనుమంతరావు తనదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. ఇక ఫైర్ బ్రాండ్ లా లేటు వయసులో దూసుకుపోతున్న వీహెచ్ పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.