వీహెచ్ సెన్సేషన్ .. చంద్రబాబు పిలిస్తే ఏపీలో టీడీపీ కోసం ప్రచారం చేస్తారట
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంత రావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద వల్లమాలిన అభిమానం పుట్టుకొచ్చింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టీడీపీలు మిత్రపక్షాలుగా మహా కూటమి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లాయి. ఘోర పరాభవాన్ని చవిచూశాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బాహాటంగానే టీడీపీ తో పొత్తు వల్ల ఓడిపోయామని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇక లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో పరిస్థితి అర్థం చేసుకున్న చంద్రబాబు లోక్ సభ ఎన్నికల బరి నుండి అసలు పోటీ చేయకుండానే తప్పుకున్నారు. ఇంత జరిగాక కూడా వీహెచ్ అభిమానం మాత్రం చంద్రబాబు మీదే ఉంది.
చంద్రబాబు ఆహ్వానిస్తే ఏపీలో ప్రచారం చేస్తానంటున్న వీహెచ్
అందుకే ఆయన చంద్రబాబు ఆహ్వానిస్తే ఏపీ కి వెళ్లి మరీ ప్రచారం చేస్తారట. ఇక అంతేనా ఎలక్షన్ కమిషన్ పనితీరు కూడా సరిగా లేదంటూ వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిస్తే.. ఆయన తరపున ప్రచారం చేస్తానన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్నారు. ఇక అధికారుల బదిలీ విషయాన్ని తప్పుపట్టారు. ఏపీలో ఎన్నికల పరిధిలో లేని నిఘా అధికారిని ఈసీ బదిలీ చేయడం అన్యాయమన్నారు. తెలంగాణలో కేసీఆర్.. ఏపీలో వైఎస్ జగన్కు లబ్ధి కలిగించేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని వీహెచ్ ఆరోపించారు.
జగన్ సీఎం అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారన్న వీ హెచ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ రాష్టాన్ని దోచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పై మండి పడిన విహెచ్ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారన్నారు. తెలంగాణలో ఓట్ల గల్లంతు విషయంలో సీఈవోపై చర్యలు తీసుకోలేదని.. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
ప్రచారంలో ముందున్న టీడిపి..! కాని మంత్రుల గెలుపు పై నెలకొన్న సందేహాలు..!!
రాజకీయ దుమారం రేపుతున్న వీహెచ్ వ్యాఖ్యలు
మొత్తానికి తాజాగా విహెచ్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు ప్రస్తావన తెస్తే తెలంగాణలో ఓట్లు పడవని భావిస్తున్న కాంగ్రెస్ నాయకులకు విహెచ్ తాజా వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. అవసరమైతే ఏపీ కి వెళ్లి ప్రచారం చేస్తా అంటున్న వి హెచ్ చంద్రబాబు నాయుడు పై ఇంత ప్రేమ కురిపించడానికి కారణం ఏమిటో అర్థం కాక సదరు కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు బాదుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీహెచ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.