ఎన్టీఆర్, బాబునే చూశా... కేసీఆరెంత?: గొర్రెలు మాకిస్తారా? అంటూ వీహెచ్ ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ అనేది స్పీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ అనేది స్పీకర్ పరిధిలో ఉంటుందని... అక్కడ పోలీసుల పెత్తనం ఏందని హనుమంతరావు ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడినైన తనను అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడనివ్వకపోవడం ఏంటని మండిపడ్డారు. తాను మాట్లాడకూడదనే ఉత్తర్వులను స్పీకర్ ఇచ్చుంటే వాటిని చూపించాలంటూ పోలీసులను కోరానని... స్పీకర్ ఉత్తర్వులు చూపిస్తే తాను వెళ్లిపోయేవాడినని అన్నారు.
అయినా వారు రాద్ధాంతం చేశారని చెప్పారు. సీఐని తాను ఏమీ అనలేదని... బూతులు తిట్టలేదని తెలిపారు. తాను సీఐని తిట్టినట్టు నిరూపిస్తే... రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నట్టుందని అసహనం వ్యక్తం చేశారు.
బీసీల గురించి తాను మాట్లాడుతున్నందుకే ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని వీహెచ్ ఆరోపించారు. గొర్రెలు మాకు, రాజ్యాధికారం మీకా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన నోరు నొక్కే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నాడంటూ విమర్శించారు. ఎన్టీఆర్ ని చూశా, చంద్రబాబును చూశా... కేసీఆర్, నీవెంత? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వీహెచ్. తనపై పోలీసు కేసును ఓ సాధారణ పోలీసు అధికారి పెట్టలేడని... దీని వెనుక ముమ్మాటికీ ప్రభుత్వ హస్తం ఉందని అన్నారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిందని వీహెచ్ మండిపడ్డారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను సిటీ బయటకు రాచకొండకు తరలిస్తామని ప్రభుత్వం చెబుతుండటాన్ని ఆయన తప్పుబట్టారు. వేరే వాళ్లు మీటింగులు ఊరి బయట పెట్టుకోవాలా...? నీవు మాత్రం నీ ఇంట్లో మీటింగులు పెట్టుకుంటావా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.
ఊరూర తిరిగి కేసీఆర్ బండారం బయటపెడతానని వీహెచ్ హెచ్చరించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు పని చేశారని ప్రశ్నించారు. ఉద్యంమలో లేని కేటీఆర్ను అంతపైన ఎందుకు పెట్టారని మండిపడ్డారు. ఎవడూ అడిగేవాడు లేడని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. ఇదేమైనా కుటుంబ రాజరిక పాలనా? అని వీహెచ్ నిలదీశారు.