నాపై ఇలాంటి విమర్శలా?: కంటతడిపెట్టిన వీహెచ్, హెచ్చరిక
హైదరాబాద్: ఎప్పుడూ ఎంతో హుషారుగా మాట్లాడుతూ అందరితో సరదాగా ఉండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సొంత పార్టీ నేతల తీరుతో కలత చెందారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కంటతడిపెట్టారు.
శుక్రవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఏడుగురు నేతలను విమర్శిస్తూ కరపత్రాలను ప్రచురించారని చెప్పారు. ఆ కరపత్రాల్లోని అసత్య కథనాలను పత్రికల్లో వార్తలుగా రాయడం అనైతికమని అన్నారు.
సొంత పార్టీ నేతలే..
తనపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని వీ హనుమంతరావు హెచ్చరించారు. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఇలా కరపత్రాలు ప్రచురించడం పార్టీకే నష్టమని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని పత్రికల్లో తనపై అసత్య వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీహెచ్ హెచ్చరిక
పీసీసీ అధ్యక్షుడిగా చేసిన తన లాంటి సీనియర్ నాయకుడిపై ఇలాంటి వార్తలు రాసే ముందు వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అని వీహెచ్ ప్రశ్నించారు. తనపై ఈ విధంగా వార్తలు రాసిన వారిపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
అలా ప్రచారం చేస్తారా?
పార్టీ కోసం నిరంతరం పాటుపడే తనపై విమర్శలు చేయడం సరికాదని వీహెచ్ అన్నారు. తాను ఎంతోమంది నాయకులను తయారు చేశానని, అలాంటి తనను బీసీలకు వ్యతిరేకమంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సోనియానే మెచ్చుకున్నారు
తనకు జాతీయ స్థాయిలో పలుకుబడి ఉందని, వరంగల్లో నిర్వహించిన సభను చూసి సోనియా గాంధీనే తనను మెచ్చుకున్నారని అన్నారు. ప్రస్తుతం ఒక లీడర్ ఎదుగుతుంటే.. అతడ్ని తొక్కేస్తున్నారని.. తాను మాత్రం చాలా మంది నేతలను పదవులిచ్చి ప్రోత్సహించానని చెప్పారు.