హరీశ్! మంచోడని అనుకున్నా.. కానీ: రెచ్చగొట్టవద్దని వీహెచ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మంచివాడని తాను భావించానని, కానీ ఆయన కుట్ర పూరిత వ్యాఖ్యలతో మంచివాడు కాదని నిరూపించుకున్నారని అన్నారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ఆయన కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాను 400 గ్రామాల ప్రజలను రెచ్చగొడతానని అనడం, మంత్రిగా ఆయన స్థాయికి తగ్గ వ్యాఖ్యలు కాదని హితవు పలికారు. కాంట్రాక్టులు, మంత్రి పదవులను ఆశగా చూపుతూ, విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీయేనని కేసీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీ మారడంపై నిప్పులు చెరిగిన వీహెచ్.. వామపక్షాల ఐడియాలజీ మట్టిలో కుక్కి కేసీఆర్ పంచన చేరారని విమర్శించారు.
అనాలోచిత నిర్ణయాలతో అధ్వానంగా హైదరాబాద్: ఉత్తమ్ విమర్శలు:
అనాలోచిత నిర్ణయాలతో టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను అధ్వానంగా మార్చేసిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
శనివారం గాంధీభవన్లో మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఆర్డిపి అంశంపై సమావేశం జరిగింది. హైదరాబాద్ మహానగర పాలకసంస్థ(జీహెచ్ఎంసీ) గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు, వాటి వల్ల జరిగే నష్టాలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై దృశ్యరూప వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి పేరిట కేబీఆర్ పార్కుతో పాటు అనేక పర్యావరణ స్థలాలను ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇలాంటి చర్యలను కాంగ్రెస్ చూస్తూ వూరుకోదని హెచ్చరించారు.
మర్రి శశిధర్రెడ్డి మాట్లాడుతూ... రోడ్డు విస్తరణ పేరుతో కేబీఆర్ పార్కును లేకుండా చేయడం దారుణమన్నారు. కేబీఆర్ పార్కులో ఖాళీస్థలం అవసరమని గతంలో ఐటీశాఖ నుంచి భూమిని తీసుకుని ఆ శాఖకు బంజారాహిల్స్లో వేరే చోట స్థలం ఇచ్చారని వివరించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పర్యావరణ వేత్తలు పురుషోత్తంరెడ్డి, సుబ్బారావులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.