పవన్ కళ్యాణ్! మా బతుకు మేం బతుకుతాం: వీ హనుమంత రావు, కేసీఆర్కు జైపాల్ సవాల్
హైదరాబాద్: తెలంగాణలో జనసేన పోటీ చేయవద్దని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు సోమవారం సూచించారు. తమ బతుకు తాము బతుకుతామని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున తాను చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడం ఖాయమని వీహెచ్ తెలిపారు.
బెజవాడ నుంచి పాదయాత్ర: కేసీఆర్ కోసం ప్రచారం చేస్తానని ఏపీ రోహిత్, కేటీఆర్ ఆలింగనం
రాహుల్ గాంధీ సమయం ఇస్తే అన్నీ చెబుతా
వెంకటస్వామి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో జరిగినంత న్యాయం మరెక్కడా జరగలేదని చెప్పారు. ఆయన తనయులు వినోద్, వివేక్ లాంటి వాళ్లను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతారని చెప్పారు. తనకు సమయాన్ని కేటాయిస్తే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి అన్నీ చెబుతానని అన్నారు.
అది మంచి పద్ధతి కాదు
వినోద్ వంటి వారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెబుతున్నారని, కానీ ఇలా ఇష్టం వచ్చినప్పుడు రావడం, మళ్లీ వెళ్లిపోవడం సరికాదని వీ హనుమంత రావు అన్నారు. అది ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ నిధులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మెగా కృష్ణారెడ్డికి వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు.
నిరూపిస్తారా.. కేసీఆర్కు సవాల్
ప్రాజెక్టుల అసలు వ్యయం కంటే 30 శాతం నిధులు అధికంగా ఖర్చు చేశారని జైపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. మెగా కృష్ణా రెడ్డి పనుల వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని విమర్శించారు. తాను చెప్పిన లెక్కలు తప్పని కేసీఆర్ నిరూపించగలరా అని సవాల్ చేసారు. కేసీఆర్ ఆర్భాటపు మాటలు మానుకోవాలని హితవు పలికారు. నాలుగేళ్లలో కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు.