తెలంగాణలో రేపట్నుంచి కరోనా వ్యాక్సిన్, వారికి ఉచితమే: రాష్ట్రంలో కొత్తగా 176 కరోనా కేసులు
హైదరాబాద్: సోమవారం(మార్చి 1) నుంచి తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్టన్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసులు తెలిపారు. 60 ఏళ్లు పైబడినవారు, 45-59ఏళ్ల మధ్య దీర్ఘాకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకునేవారు ఇలా చేయండి..
ఆదివారం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా టీకా తీసుకుకోవాలనుకునేవారు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా కోవిన్(cowin.gov.in)రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కరోనా టీకా అందిస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్కి వచ్చిన లింక్ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో కరోనా టీకా తీసుకోవచ్చని వివరించారు.
తెలంగాణలోని ప్రతి జిల్లాల్లోనూ..
ప్రతి జిల్లాలలో 2, హైదరాబాద్ నగరంలో 12 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసులు వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతోపాటు వైద్యులు ఇచ్చిన ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో ధృవీకరణ పత్రం అప్లోడ్ చేసినా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని స్పస్టం చేశారు.
ప్రభుత్వ ఆప్పత్రులో ఉచితం.. 215 ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్
రాబోయే వారం రోజుల్లో 1000కిపైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామన్నారు. 215 ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు అనుమతి ఉందని తెలిపారు. అందరూ మొదటి రోజే వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకోవద్దని
డీఎంఈ రమేష్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్చైర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, దేశ వ్యాప్తంగా మార్చి 1 నుంచి రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 60ఏళ్లకు పైబడినవారికి ఉచిత వ్యాక్సిన్ అందిస్తున్నట్లు పేర్కొంది.
తెలంగాణలో కొత్తగా 176 కరోనా కేసులు, ఒకరు మృతి
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,985 నమూనాలను పరీక్షింగా.. 176 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,98,807కి చేరింది. కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1634కి చేరింది. తాజాగా, కరోనా నుంచి 163 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,95,222కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1951గా ఉంది. వీరిలో 859 మంది హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 87,00,651 కరోనా నమూనాలను పరీక్షించారు.