500 కేంద్రాల్లో వ్యాక్సినేషన్.. సోమవారం నుంచి అమలు, ఎందుకంటే..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెంటర్లు పెంచుతున్నారు. నిన్న 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా టీకాల కార్యక్రమం కొనసాగింది. అయితే కొన్నిచోట్ల సమయానికి అనుకూలంగా వ్యాక్సినేషన్ కొనసాగలేదు. దీంతో వ్యాక్సిన్ కేంద్రాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 139 సెంటర్లను 500కు పెంచుతున్నామని ప్రకటించారు.
సోమవారం నుంచి వాక్సిన్ సెంటర్లు పెంచుతున్నామని అధికారులు ప్రకటించారు. 500 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. 30 నుంచి 100 మంది వరకు వాక్సిన్ తీసుకొంటారు. కొవిన్ సాప్ట్వేర్లో సాంకేతిక సమస్యలు రావడంతో.. లబ్ధిదారుల ఎంపికపై ఇబ్బందులు వస్తున్నాయి. మాన్యువల్గా అయినా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. శనివారం ఉదయం 10.30కు వర్చువల్గా ప్రధాని మోడీ ప్రసంగం పూర్తవ్వగానే.. రాష్ట్రంలోని 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటి టీకాను గాంధీ ఆస్పత్రిలో సఫాయీ కర్మచారిగా పనిచేస్తున్న కిష్టమ్మకు వేశారు. ఆమె గాంధీ ఆస్పత్రిలో 14 ఏళ్లుగా సఫాయీ కర్మచారిగా పనిచేస్తున్నారు. కరోనా తారాస్థాయిలో ఉన్నప్పుడు ఆమె కుటుంబానికి దూరంగా ఉంటూ.. కొవిడ్ వార్డుల్లో సేవలు అందించారు. కొన్నిచోట్ల వ్యాక్సినేషన్కు రాకపోవడంతో.. 94% మందికే టీకాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.