జంట కనిపిస్తే పెళ్లే!: వాలెంటైన్స్ డే రోజున పార్కుల వెలవెల!, గిఫ్టుల వేటలో..
హైదరాబాద్: నిత్యం యువతీయువకులు, జంటలతో కళకళలాడే పార్కులు ప్రేమికుల రోజైన బుధవారం(ఫిబ్రవరి 14న)నాడు నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల్లో భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు వాల్ పోస్టర్లు వేశారు.
Recommended Video
అంతేగాక, ప్రేమజంటలు కనపడితే వివాహం చేస్తామని పోస్టర్లలో హెచ్చరించడంతో సంజీవయ్యపార్కు, ఇందిరా పార్కు, నెక్లెస్ రోడ్, ఈట్ స్ట్రీట్, లవ్ హైదరాబాద్ చిహ్నం తదితర స్థలాలు నిర్మానుషంగా మారాయి.
షీ టీమ్స్ నిఘా
కాగా, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భజరంగ్ దళ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మారువేశాల్లో షీ టీమ్స్ నిఘా పెట్టాయి.
పార్కులు వెలవెల
అయితే, బుధవారం రోజున యువ జంటలు పార్కులు, పబ్బులకు దూరంగా ఉండటం గమనార్హం. దీంతో పార్కులు, పబ్బులు వెలవెలబోయాయి. ఇదిఇలావుంటే.. పార్కులు, హోటల్స్, పబ్బులు, బార్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చర్యలు తప్పవంటూ..
ప్రేమ జంటలకు వేదికలైన నగరంలోని హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డులో పోలీసులు బందోబస్తును పెంచారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
కానుకలతో ప్రేమజంటలు
ఇది ఇలావుంటే, ప్రేమ జంటలు మాత్రం తమ ప్రియుడు, ప్రియురాలి కోసం ప్రత్యేక కానుకలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పలు గిఫ్ట్ షాపుల్లో యువత పెద్ద ఎత్తున కొనుగోళ్ళు జరపడం కనిపించింది.