వాలెంటైన్ డే పేరుతో రూ.200 కోట్ల వ్యాపారం: ప్రేమజంటలకు దళ్ హెచ్చరిక
హైదరాబాద్: భాగ్యనగరంలో వాలెంటైన్ డేను వ్యతిరేకిస్తూ ఓ వర్గం, సమర్థిస్తూ మరో వర్గం ర్యాలీలు తీస్తోంది. వాలెంటైన్ డేను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆదివారం నాడు ర్యాలీలు తీశారు. విదేశీ సంస్కృతి అయిన వాలెంటైన్ డేను అందరూ వ్యతిరేకించాలని వారు నినాదాలు చేశారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు వాలెంటైన్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాలెంటైన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్కులలో ఎవరైనా ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పార్కుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో, పార్కుల్లో ప్రేమజంటలు తగ్గాయి.
ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలి వద్ద విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రేమికుల రోజును భారత్లో జరుపవద్దని నినాదాలు చేశారు. తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, పాశ్చాత్య సంస్కృతికి, వాలెంటైన్ డేకు వ్యతిరేకమన్నారు.
రహదారిపై ఆందోళన చేస్తున్న విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలను రాంగోపాల్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోను ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. కొన్నిచోట్ల పోలీసులు వాలెంటైన్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా అడ్డుకున్నారు.
తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, వాలెంటైన్ డేకు మాత్రమే వ్యతిరేకమని చెబుతున్నారు. వాలెంటైన్ డే పేరుతో అమెరికా వంటి విదేశాలు రూ.200 కోట్ల వ్యాపారం భారత దేశంలో చేసుకుంటున్నాయన్నారు. అమెరికా గ్రీటింగ్ కార్డుతో ప్రేమించుకోవడం ఏమిటన్నారు. పక్క దారి పడుతున్న యువతను తాము చైతన్యవంతులను చేస్తామని చెప్పారు.
మరోవైపు, ప్రేమికులకు తాము అండగా ఉంటామని కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రపంచ ప్రేమికులారా.. ఓయుకు రండి మేం అండగా నిలబడతామని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రేమ జంటలు క్యాంపస్ వస్తే తాము రక్షణ కల్పిస్తామన్నారు. తాము ఇండియన్ లవర్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.