కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు: ఎమ్మెల్యే వంశీ ఆవేదన
హైదరాబాద్: తన నియోజకవర్గ ప్రజల సమస్యలను చర్చించేందుకు శాసనసభ్యుడి హోదాలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిసేందుకు నెలల తరబడి ఎదురుచూస్తున్నానని మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి తెలిపారు. తానెంత ప్రయత్నించినా కనీస సమయం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు సేవ చేసేందుకు వైద్యవిద్యను వదిలి రాజకీయాల్లోకి వచ్చానని.. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నియంతను తలపిస్తోందని.. అలాంటి వ్యక్తి ఉన్న శాసనసభలో తాను సభ్యుడిగా ఉన్నందుకు చింతిస్తున్నానని అన్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకు కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం సోమవారం అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.