విజయ్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్: అమ్మాయిలతో ఉన్న ఫోటోలతో లాయర్ బెదిరించారా?
హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నటుడు విజయ్ సాయి గురించి ఆయన భార్య వనిత సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. తన భర్త అమ్మాయిలతో కలిసి తిరిగేవాడని చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: విజయ్ అంత్యక్రియలకు రాని భార్య, కూతుర్నీ తీసుకురాలేదు, 'విడాకులకు రూ.3 కోట్లు'
దీంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు. తనను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదలొద్దు అంటూ తన తండ్రిని కోరాడు.
కేసులో కొత్త అనుమానాలు
తన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు వారి వద్ద ఉన్నాయని విజయ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు, న్యాయవాది రూ.3 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో ఈ కేసులో కొత్త అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఆ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశారా
వనిత విడుదల చేసిన ఈ ఫోటోలు, వీడియోలతో న్యాయవాది నటుడు విజయ్ను బెదిరించి ఉంటాడా? అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. తనను బ్లాక్ మెయిల్ చేయడంతో అతను అఘాయిత్యానికి పాల్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.
ముందస్తు బెయిల్కు ప్రయత్నాలు
వనిత సహా నిందితులు పోలీసులకు అందుబాటులో లేరు. వనిత ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఆమెను ట్రేస్ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆమెను అదుపులోకి తీసుకోలేకపోయారు. పోలీసుల కళ్లుగప్పుతున్న నిందితులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
వనిత ఏం చెప్పారంటే
కుమార్తె కోసం పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నానని, కుమార్తెను ఒంటరి చేసి వెళ్లారని, ఎవరూ తన కుమార్తె గురించి ఆలోచించడం లేదని, తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని విడుదల చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోతానని, రెండు క్లిప్స్ ఇప్పుడు పంపిస్తున్నానని, ఇంకా కొన్ని రావాల్సి ఉందని వనిత చెప్పిన విషయం తెలిసిందే. కేవలం తనను టార్గెట్ చేసుకొని విజయ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారని, తనకు సినిమాలు, టీవీల్లో అవకాశాలు తగ్గిపోయాయని ఆమె వాపోయారు.