రేవంత్ రెడ్డికి ఊహించని షాక్: టీఆర్ఎస్లోకి కేసీఆర్పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి?
గజ్వెల్/సిద్దిపేట: తెలంగాణ రాజకీయాల్లో మరో ఊహించని ట్విస్ట్! స్వయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన గజ్వెల్ నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆ పార్టీకి, పార్టీలోని కీలక నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డికి ఊహించని షాకిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
వంటేరు ప్రతాప్ రెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైన పోటీ చేసి ఓడిపోయారు. మొదటిసారి 17వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే మూడు రెట్లకు పైగా మెజార్టీతో ఓటమి చవిచూశారు. అయితే, ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
రేపు తెరాసలోకి వంటేరు
వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తెరాసలో చేరనున్నారని నియోజకవర్గం పరిధిలో జోరుగా ప్రచారం సాగుతోందట. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. రేపు పార్టీలో చేరనున్న వంటేరు... ఆ తర్వాత కేసీఆర్ను ఆహ్వానించి, తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమా లేక నిజంగానే చేరుతున్నారా అంటే ఆయన పెదవి విప్పాల్సి ఉంది.
రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లోకి
వంటేరు ప్రతాప్ రెడ్డికి గజ్వెల్ నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న ఆయన, ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ కూడా ఎన్నికలకు ఏడాదికి ముందు టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. టీడీపీలోని తనకు సన్నిహితంగా ఉన్న వారితో కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరినప్పుడే తన వారికి టిక్కెట్ హామీని కూడా రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం నుంచి తీసుకున్నారు.
కేసీఆర్, వంటేరు మధ్య టఫ్ ఫైట్
ఇందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ మీద గెలిచారు. 2014లో తెలుగుదేశం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండుసార్లు కూడా కేసీఆర్ విజయం సాధించారు. వంటేరుకు స్థానికంగా ఉన్న మంచి పేరు కారణంగా 2014లో కేసీఆర్ గెలుపు కష్టమని అందరు భావించారు. అప్పుడు కేసీఆర్ గెలిచినప్పటికీ 17వేల స్వల్ప మెజార్టీతో గెలిచారు. 2018లోను కేసీఆర్ గెలుపు అంత సులభమేమీ కాదని భావించారు. కానీ తెరాస అధికారంలో ఉండటం, కేసీఆర్ సీఎం కాబట్టి వంటేరుపై యాభై వేల పై చిలుకు మెజార్టీతో గెలిచారు. మొత్తానికి కేసీఆర్కు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఓ సీఎం, ఆయన గెలుపు కోసం హరీష్ రావు ఏకంగా దాదాపు నెల నుంచి రెండు నెలల వరకు గజ్వెల్ నియోజకవర్గంలో తిష్టవేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. వంటేరును ఓడించినప్పటికీ అందుకు తెరాస నేతలు పడిన కష్టమే... నియోజకవర్గంలో ఆయనకు ఉన్న మంచి పేరును వెల్లడిస్తోందని అంటున్నారు.
కేసీఆర్ను ఓడించడమే రాజకీయ లక్ష్యమని చెప్పి
2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ పైన వంటేరు నిలబడినప్పుడు ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. వంటేరు ఇంట్లో రాత్రివేళల్లో పోలీసులు తనిఖీ చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం చేశారు. ఫిర్యాదులు చేశారు. వంటేరుకు అండగా రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు నిలబడ్డారు. తన రాజకీయ లక్ష్యం కేసీఆర్ను గద్దె దింపడమేనని రేవంత్ చెబితే, తన లక్ష్యం గజ్వెల్లో కేసీఆర్ను ఓడించడమేనని వంటేరు ప్రకటించారు. అలాంటి వంటేరు ఇప్పుడు తెరాసలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది.